తక్కువ ధరకు బంగారం పేరుతో మోసం.. మాజీ మంత్రి అల్లుడు అరెస్ట్
ABN , First Publish Date - 2021-12-06T17:38:43+05:30 IST
తక్కువ ధరకు బంగారం విక్రయిస్తానంటూ పుదుచ్చేరి రాష్ట్రానికి చెందిన మాజీ మంత్రి పన్నీర్సెల్వం అల్లుడు ప్రవీణ్ అలెగ్జాండర్ (31) సహా ముగ్గురి వద్ద ఆరు కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసి మోసగించిన నలుగురిని పోలీసులు
మాజీ మంత్రి అల్లుడు సహా ముగ్గురి వద్ద రూ.6.5 కోట్ల వసూలు - నలుగురి అరెస్టు
చెన్నై/అడయార్: తక్కువ ధరకు బంగారం విక్రయిస్తానంటూ పుదుచ్చేరి రాష్ట్రానికి చెందిన మాజీ మంత్రి పన్నీర్సెల్వం అల్లుడు ప్రవీణ్ అలెగ్జాండర్ (31) సహా ముగ్గురి వద్ద ఆరు కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసి మోసగించిన నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు వివరాలను పరిశీలిస్తే, ప్రవీణ్ అలెగ్జాండర్, అతడి స్నేహితులైన ఐస్ క్రీమ్ వ్యాపారి గౌతమన్ (29), జీడిపప్పు, పిస్తా వంటి డ్రైఫ్రూట్ వ్యాపారం చేసే గణేష్ కుమార్ (33)కు స్థానిక చెన్నై పులియంతోపు కన్నికాపురానికి చెందిన పారిశ్రామికవేత్త బాలాజీ (34)తో ఇటీవల పరిచయం ఏర్పడింది. దినేశ్ అనే వ్యక్తి ఈ ముగ్గురికి బాలాజీని పరిచయం చేశాడు. ఆ తర్వాత బాలాజీ తండ్రి తులసిదాస్ (50), మాధవరంకు చెందిన జయకృష్ణన్ (43), మహేష్ (45) అనే వ్యక్తులు కూడా పరిచయమయ్యారు.
తులసిదాస్ ఐఏఎస్ అధికారిగా పనిచేస్తున్నారని, ఆయన పరపతితో కస్టమ్స్ అధికారుల సహకారంతో బిల్లులు లేకుండా సెల్ఫోన్లు, బంగారం, వెండి, కార్లు ఇలా కొనుగోలు చేసి తక్కువ ధరలకు అమ్ముతున్నట్టు బాలాజీ ప్రవీణ్ అలెగ్జాండర్ అతడి స్నేహితులు తెలిపారు. అతడి మాటలను నమ్మి ప్రవీణ్, అతడి స్నేహితులు గౌతమన్, గణేష్కుమార్ బంగారం కొనుగోలుకు రూ.6లక్షలను బాలాజీకి ఇచ్చాడు. మాట ప్రకారం బాలాజీ ఈ ముగ్గురికి బంగారం ఇచ్చాడు. ఆ తర్వాత ప్రవీణ్ అతడి స్నేహితులకు తక్కువ ధరకు మరింతగా బంగారం కొనాలనే ఆశపుట్టింది. ఈ విషయం తెలుసుకున్న బాలాజీ అతడి స్నేహితులు రూ.6.5 కోట్లను తీసుకుని త్వరలో బంగారం ఇస్తానని తెలిపి చెప్పాపెట్టకుండా మాయమయ్యాడు. ప్రవీణ్ అలెగ్జాండర్ అతడి స్నేహితులు కీల్పాక్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు బాలాజీతో పాటు నలుగురిని అరెస్టు చేశారు.