వందేళ్లనాటి కూరగాయల సంత మళ్లీ ప్రారంభం
ABN , First Publish Date - 2020-09-23T16:15:41+05:30 IST
కాంచీపురం నగరంలో 100 ఏళ్లనాటి పురాతన కూరగాయల సంతను మళ్లీ ప్రారంభించడంపై వ్యాపారులు, స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. కాంచీపురం పాత రైల్వేస్టేషన్...
చెన్నై (ప్యారీస్): కాంచీపురం నగరంలో 100 ఏళ్లనాటి పురాతన కూరగాయల సంతను మళ్లీ ప్రారంభించడంపై వ్యాపారులు, స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. కాంచీపురం పాత రైల్వేస్టేషన్ రోడ్డులో వందేళ్లకు పైగా రాజాజీ కూరగాయల సంత పనిచేస్తోంది. కరోనా కారణంగా సంతను కాంచీపురం సమీపంలో ఉన్న వయ్యావూరుకు మార్చారు. అయితే ఆ ప్రాంతానికి రవాణా వసతి లేని కారణంగా ఆ సంతను కాంచీపురం నుంచి 7కి.మీ దూరంలో ఉన్న నజరేత్పేట సమీపంలోని పచ్చయప్ప గ్రౌండ్కు మార్చారు. ఇది నగరానికి దూరంగా ఉండడం వల్ల ప్రజలు మార్కెట్కు వెళ్లకపోవడంతో వ్యాపారులు నష్టపోయేవారు. దీంతో రాజాజీ కూరగాయల సంతను ప్రారంభించాలని కూరగాయల వ్యాపారులు కాంచీపురం కలెక్టర్ పొన్నయ్యకు వినతిపత్రం సమర్పించారు. పరిశీలించిన కలెక్టర్ సోమవారం నుంచి పాత కూరగాయల సంత పనిచేసేందుకు అనుమతులు జారీ చేశారు. అన్నాడీఎంకే మాజీ ఎమ్మెల్యే వి.సోమసుందరం, కాంచీపురం జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ గణేశ్, మాజీ ఎమ్మెల్యే మైథిలి తిరునావుక్కరసు, వ్యాపార సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.