జలదిగ్బంధంలోనే తూత్తుకుడి
ABN , First Publish Date - 2021-01-22T12:54:07+05:30 IST
వర్షం తగ్గుముఖం పట్టి ఐదురోజులు దాటినా తూత్తుకుడి జిల్లాలోని పలు ప్రాంతాలు ఇంకా జలదిగ్భంధంలోనే ఉన్నాయి. గత వారం కురిసిన భారీ వర్షాల కారణంగా జిల్లాలోని ...
చెన్నై/పెరంబూర్ (ఆంధ్రజ్యోతి): వర్షం తగ్గుముఖం పట్టి ఐదురోజులు దాటినా తూత్తుకుడి జిల్లాలోని పలు ప్రాంతాలు ఇంకా జలదిగ్భంధంలోనే ఉన్నాయి. గత వారం కురిసిన భారీ వర్షాల కారణంగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో నీరు నిలిచి ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. కార్పొరేషన్ అధికారులు, పారిశుధ్య కార్మికులు నీటిని తొలగించేందుకు ముమ్మరంగా కృషి చేస్తున్నా, ఇంకా అనేక ప్రాంతాలు జలదిగ్భంధంలోనే ఉన్నాయి. కురింజి నగర్, ముత్తమ్మాళ్ కాలనీ, రామ్నగర్, రహ్మత్నగర్, లెవింజిపురం, బ్రైంట్నగర్ తదితర ప్రాంతాల్లో నాలుగు అడుగులకు పైగా నీరు వుండడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేకపోతున్నారు. కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో నిలిచి ఉన్న నీరు చిన్న చెరువులా తలపిస్తోంది. నేతాజీనగర్ ప్రాంతంలో చేరిన నీటిని తొలగించాలని కోరుతూ ఆ ప్రాంత ప్రజలు గురువారం ఆందోళన చేపట్టారు. కార్పొరేషన్, పోలీసు అధికారులు అక్కడకు చేరుకొని వారితో చర్చించి ఆందోళన విరమింపజేశారు. జిల్లావ్యాప్తంగా అన్ని చెరువులు జలకళను సంతరించు కున్నాయి. పంచాయతీల నిర్వహణలో ఉన్న 407 చెరువుల్లో 225 చెరువులు 100 శాతం నిండాయి. 111 చెరువులు 75 శాతం, 55 చెరువులు 50 శాతం, 14 చెరువులు 25 శాతం నిండినట్టు ప్రజాపనుల శాఖ అధికారులు తెలిపారు.