సీపీఎంకు చెరియన్ ఫిలిప్ భారీ షాక్

ABN , First Publish Date - 2021-10-29T22:55:09+05:30 IST

సుదీర్ఘ రాజకీయ అనుభంగల చెరియన్ ఫిలిప్ సీపీఎంకు

సీపీఎంకు చెరియన్ ఫిలిప్ భారీ షాక్

తిరువనంతపురం : సుదీర్ఘ రాజకీయ అనుభంగల చెరియన్ ఫిలిప్ సీపీఎంకు షాక్ ఇచ్చారు. ఆ పార్టీతో సుమారు 20 ఏళ్ళ అనుబంధాన్ని తెంచుకుని తిరిగి కాంగ్రెస్‌లో చేరారు. శుక్రవారం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, అభిప్రాయాలను వెల్లడించే స్వేచ్ఛ సీపీఎంలో లేదని, కాంగ్రెస్ సజీవంగా ఉంటేనే, దేశం మనుగడ సాగించగలదని చెప్పారు. 


ముఖ్యమంత్రి పినరయి విజయన్ నేతృత్వంలోని కేరళ ప్రభుత్వంపై చెరియన్ ఫిలిప్ కొంత కాలంగా నర్మగర్భంగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఆయన పార్టీ మారే యోచనలో ఉన్నారనే ఊహాగానాలు చెలరేగాయి. వీటన్నిటికీ తెరదించుతూ తాను కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు శుక్రవారం ప్రకటించారు. ఆయన ప్రారంభంలో కాంగ్రెస్ పార్టీలోనే ఉండేవారు. ఈ విలేకర్ల సమావేశానికి ముందు ఆయన తన రాజకీయ గురువు, కాంగ్రెస్ సీనియర్ నేత ఏకే ఆంటోనీ నివాసానికి వెళ్ళారు. 


సీపీఎంలో తన రాజకీయ అస్థిత్వం దెబ్బతిందని ఫిలిప్ చెప్పారు. తన రాజకీయ గుర్తింపును కాపాడుకోవడానికే తాను కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు తెలిపారు. తనను రాజకీయ ప్రయోజనాల కోసం ఎల్‌డీఎఫ్ వినియోగించుకుందన్నారు. సీపీఎంలో ఉన్న 20 సంవత్సరాలు తాను ప్రధాన రాజకీయ స్రవంతి నుంచి వైదొలగవలసి వచ్చిందన్నారు. తాను రాజకీయాల నుంచి తప్పుకోలేనని చెప్పారు. కాంగ్రెస్‌లో ఉన్నపుడు తనకు లభించినంత స్వేచ్ఛ సీపీఎంలో దొరకలేదని తెలిపారు. 


దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితిని విధించినపుడు తాను కాంగ్రెస్‌ను విమర్శిస్తూ పుస్తకాలు రాశానన్నారు. అప్పటి ముఖ్యమంత్రులు కరుణాకరన్, ఏకే ఆంటోనీ తనపై దురభిప్రాయాన్ని ఏర్పరచుకోలేదన్నారు. అటువంటి స్వేచ్ఛ సీపీఎంలో తనకు లభించలేదన్నారు. 


శరణార్థి శిబిరంలో మరణించే కన్నా సొంత ఇంట్లో చావడం మేలని చెప్పారు. ఛాందసవాదానికి ప్రత్యామ్నాయం కాంగ్రెసేనని చెప్పారు. కాంగ్రెస్ మరణిస్తే, భారత దేశం మనుగడ ఉండదన్నారు. 


Updated Date - 2021-10-29T22:55:09+05:30 IST