అర్నాబ్ వాట్సాప్ చాట్ లీక్: రాజ్నాథ్ను నిలదీసిన చిదంబరం
ABN , First Publish Date - 2021-01-17T17:50:30+05:30 IST
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఆర్పీ కుంభకోణం కేసు ఊహించని మలుపు తిరిగింది. ముంబై పోలీసులు ఈ కేసును విచారిస్తుండగానే... రిపబ్లిక్ టీవీ చీఫ్ ఆర్నాబ్ గోస్వామి, బార్క్ మాజీ సీఈవో పార్థోదాస్ గుప్తా సహా పలువురి మధ్య జరిగిన
న్యూఢిల్లీ: రిపబ్లిక్ టీవీ చానల్ సీఈవో అర్నాబ్ గోస్వామి వాట్సాప్ చాట్ లీక్పై కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ను మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం నిలదీశారు. దేశ రహస్యానికి సంబంధించిన విషయం ప్రభుత్వానికి మద్దతుగా ఉండే ఒక జర్నలిస్ట్కు ఎలా తెలిశాయని ఆయన ప్రశ్నించారు. బాలాకోట్ దాడి గురించి మూడు రోజుల ముందే ఆ జర్నలిస్ట్కు అతడి స్నేహితుడికి ఎలా తెలిశాయని, వారు పాకిస్తాన్ ఇన్ఫార్మర్లతో ఈ సమాచారాన్ని పంచుకోలేదని గ్యారంటీ ఏమిటని రాజ్నాథ్ను నిలదీశారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఆర్పీ కుంభకోణం కేసు ఊహించని మలుపు తిరిగింది. ముంబై పోలీసులు ఈ కేసును విచారిస్తుండగానే... రిపబ్లిక్ టీవీ చీఫ్ ఆర్నాబ్ గోస్వామి, బార్క్ మాజీ సీఈవో పార్థోదాస్ గుప్తా సహా పలువురి మధ్య జరిగిన సంభాషణలు లీక్ అయ్యాయి. దాదాపు 500 పేజీలకు పైగా ఉన్న ఈ చాట్ మెసేజ్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంట్లో రక్షణ రహస్యాలు సహా అనేక మంది గురించి ఇద్దరి మధ్య కీలక సంభాషణ జరిగింది. ఈ సంభాషణపై దేశ వ్యాప్తంగా అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.
ఈ విషయమై చిదంబరం ఆదివారం తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందిస్తూ ‘‘జాతీయ భద్రతకు సంబంధించిన రహస్య నిర్ణయం గురించి ప్రభుత్వ అనుకూల జర్నలిస్టుకు సమాచారం ఎలా వచ్చింది? ఈ విషయం ముందుగానే తెలిసిన ఆ వ్యక్తి గూఢచారులతో కానీ పాకిస్తాన్తో పనిచేసే ఇన్ఫార్మర్లతో సహా ఇతరులతో సమాచారాన్ని పంచుకోలేదని హామీ ఏమిటి? అసలు బాలకోట్ శిబిరంలో జరిగిన సర్జికల్ దాడుల గురించి మూడు రోజుల ముందు ఒక పాత్రికేయుడు అతని స్నేహితుడికి ఎలా తెలిశాయి?’’ అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్లో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ను ట్యాగ్ చేశారు.