నిమ్మగడ్డ మాదిరే మనమూ సుప్రీంకు..
ABN , First Publish Date - 2021-01-22T08:36:52+05:30 IST
ప్రతిపక్ష నేత చంద్రబాబు, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి సూచనల మేరకే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్కుమార్ గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ పై కోర్టుకు వెళ్లారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆరోపించినట్లు తెలిసింది.
మంత్రులతో ముఖ్యమంత్రి జగన్
అమరావతి, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): ప్రతిపక్ష నేత చంద్రబాబు, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి సూచనల మేరకే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్కుమార్ గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ పై కోర్టుకు వెళ్లారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆరోపించినట్లు తెలిసింది. వాక్సినేషన్ పూర్తయ్యేవరకూ స్థానిక ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేదంటూ మనం కూడా సుప్రీంకోర్టుకు ఎందుకు వెళ్లకూడదని సహచర మంత్రులతో ఆయన అన్నట్లు సమాచారం. మనమూ అక్కడ పిటిషన్ వేస్తున్నామని చెప్పినట్లు తెలుస్తోంది. పంచాయతీ ఎన్నికలను నిర్వహించాలని హైకోర్టు గురువారం తీర్పు ఇచ్చిన వెంటనే.. అందుబాటులో ఉన్న మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎంవో అధికారులతో జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. హైకోర్టు తీర్పుపై తక్షణమే సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించినట్లు ఆయన వారికి తెలియజేశారు.