Chief Minister: ఊపిరున్నంత వరకు ప్రజా సేవే

ABN , First Publish Date - 2022-08-27T14:36:54+05:30 IST

అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజలతో మమేకమై వారి సమస్యల పరిష్కారం కోసం పోరాడటమే తన లక్ష్యమని, ఊపిరున్నంత వరకు ప్రజా సేవ

Chief Minister: ఊపిరున్నంత వరకు ప్రజా సేవే

                                   - ఈరోడ్‌ సభలో సీఎం స్టాలిన్‌


చెన్నై, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజలతో మమేకమై వారి సమస్యల పరిష్కారం కోసం పోరాడటమే తన లక్ష్యమని, ఊపిరున్నంత వరకు ప్రజా సేవ కొనసాగిస్తానని ముఖ్యమంత్రి స్టాలిన్‌(Chief Minister Stalin) ప్రకటించారు. ఈరోడ్‌ జిల్లా పెరుందురైలో శుక్రవారం ఉదయం ఏర్పాటైన ప్రత్యేక సభలో వివిధ శాఖల ఆధ్వర్యంలో రూ.613.51 కోట్ల వ్యయంతో పూర్తయిన పథకాలను ఆయన ప్రారంభించారు. ఇదేవిధంగా ఆ జిల్లాల్లో రూ.184 కోట్లతో చేపట్టనున్న పథకాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎం ప్రసంగిస్తూ ... ప్రసిద్ధి చెందిన పెరుందురైలో ఈ సభను ఏర్పాటు చేయడం తనకెంతో గర్వకారణంగా ఉందని, ఈరోడ్‌ జిల్లా అంటే ద్రవిడ(Dravida) ఉద్యమనేత పెరియార్‌ గుర్తుకు వస్తారని చెప్పారు. ఈరోడ్‌ జిల్లాకు తాను ఎన్నో వరాలు ప్రకటించానని, అవన్నీ ఏడాది పాలనలో నెరవేరాయని తెలిపారు. మూడు రోజులుగా విశ్రాంతి లేకుండా మూడు జిల్లాల్లో పర్యటిస్తున్నానని, ఆ సమయంలో తాను రెండు శుభవార్తలు విన్నానని తెలిపారు. రాష్ట్రం 20 శాతం అధికంగా వరిధాన్యాన్ని ఉత్పత్తి చేసి రికార్డు నెలకొల్పిందని, అన్ని కులాలవారు అర్చకులు అయ్యేలా తమ ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టం చెల్లుబాటు అవుతుందని హైకోర్టు(High Court) కితాబునిచ్చిందని చెప్పారు. పదిహేను నెలలుగా తాను ప్రభుత్వ కార్యక్రమాలు, సభల్లో పాల్గొంటున్నట్లు గుర్తు చేశారు. ‘స్టాలిన్‌ అంటేనే అలుపెరుగని యువకిశోరం’ అని డీఎంకే వ్యవస్థాపకుడు అన్నాదురై, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ప్రశంసించారని పేర్కొన్నారు. ఈరోడ్‌ జిల్లాల్లో అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో పదేళ్లుగా అసంపూర్తిగా ఉన్న పథకాలన్నింటినీ ఏడాదిలోపే పూర్తి చేసిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.  పదిహేను నెలలుగా ప్రజా సంక్షేమం కోసమే పాటుపడుతున్నానని, ప్రజలను నేరుగా కలుసుకుంటూ వారి సమస్యలను అడిగి తెలుసుకుని ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నానని ఆయన చెప్పారు. తాను కోటలో ఉన్నా ప్రజల మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నానన్నారు. విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో రాష్ట్రాన్ని అభివృద్ధిపరచటమే తన ధ్యేయమని, ఆ దిశగా ఊపిరున్నంతవరకూ రాష్ట్ర ప్రజలకు సేవలు అందిస్తానని ఆయన ఉద్వేగంగా తన ప్రసంగాన్ని ముగించారు. ఈ సభలో మంత్రులు ఎస్‌. ముత్తుసామి(Ministers S. Muthusamy), సామినాథన్‌, కయల్‌విళి సెల్వరాజ్‌, రాజ్యసభ సభ్యుడు అందియూరు సెల్వరాజ్‌, ఎంపీ గణేశమూర్తి, కొంగునాడు మక్కల్‌ దేశియకట్చి అధ్యక్షుడు ఈశ్వరన్‌, శాసనసభ్యులు వెంకటాచలం, తిరుమగన్‌ ఈవేరా, కలెక్టర్‌ హెచ్‌. కృష్ణున్ని, మేయర్‌ నాగరత్తినం, మాజీ మంత్రి తోప్పు వెంకటాచలం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-27T14:36:54+05:30 IST