పిల్లల కిడ్నాపింగ్‌ ముఠా కలకలం

ABN , First Publish Date - 2020-08-08T10:25:20+05:30 IST

జిల్లా కేంద్రమైన సంగారెడ్డి పట్టణంలో పిల్లలను కిడ్నాప్‌ చేసే అంతర్‌జిల్లా కిడ్నాపింగ్‌ ముఠా కదలికలతో పట్టణ వాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

పిల్లల కిడ్నాపింగ్‌ ముఠా కలకలం

సంగారెడ్డిలో అంతర్‌జిల్లా ముఠా సభ్యురాలి నివాసం

కిడ్నాపర్లను సంగారెడ్డిలో అదుపులోకి తీసుకున్న కామారెడ్డి పోలీసులు

స్థానిక పోలీసులకు సమాచారం కరువు


సంగారెడ్డి క్రైం, ఆగస్టు 7 : జిల్లా కేంద్రమైన సంగారెడ్డి పట్టణంలో పిల్లలను కిడ్నాప్‌ చేసే అంతర్‌జిల్లా కిడ్నాపింగ్‌ ముఠా కదలికలతో పట్టణ వాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ముఖ్యంగా చిన్న పిల్లల తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొన్నది. వివిధ ప్రాంతాల్లో చిన్న పిల్లలను కిడ్నాప్‌ చేసి డబ్బులకు విక్రయించే ఈ ముఠా సభ్యులను కామారెడ్డి జిల్లా పోలీసులు సంగారెడ్డి జిల్లాకు వచ్చి మంగళవారం అదుపులోకి తీసుకొని వెళ్లారు. సంగారెడ్డి పట్టణానికి చెందిన వడ్డెర పద్మ, పటాన్‌చెరు మండలం ఇస్నాపూర్‌లో నివాసముంటున్న కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డికి చెందిన ఎరుకుల నవీన్‌, గుమ్మడిదల మండలం అన్నారానికి చెందిన రవళి, సిరిసిల్లా జిల్లాకు చెందిన మామిడాల వెంకటేష్‌ కలిసి ఒక ముఠాగా ఏర్పడి చిన్న పిల్లలను కిడ్నాప్‌ చేసి విక్రయించడం పనిగా పెట్టుకున్నారు.


గత నెల 31వ తేదీన కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం జంగంపల్లి శివారులో గుడారాలు వేసుకొని ఔషధాలు విక్రయించే మహారాష్ట్రకు చెందిన సంజూసింగ్‌, పూజాబాయిల రెండున్నర నెలల మగ శిశువును ఈ ముఠా సభ్యులు కిడ్నాప్‌ చేశారు. చిన్నారిని సంగారెడ్డిలో నివాసముంటున్న వడ్డెర పద్మ ఇంట్లో దాచిపెట్టారు. కామారెడ్డి జిల్లా పోలీసులు రంగంలోకి దిగి సంగారెడ్డి పట్టణంలో ఉన్న పద్మ ఇంట్లో దాడులు నిర్వహించి పసికందును స్వాధీనం చేసుకోవడంతో పాటు ముఠా సభ్యులను అరెస్ట్‌ చేశారు. ఈ ముఠా సభ్యుల్లో ఒకరైన రవళి ఒక హత్య కేసులో నిందితురాలు.


అంతర్‌జిల్లా పిల్లల కిడ్నాప్‌ ముఠా సభ్యులు సంగారెడ్డి పట్టణంలోనే నివాసముంటున్నా స్థానిక పోలీసులు మాత్రం వారి కదలికలను కనిపెట్టలేకపోయారు. కామారెడ్డి జిల్లా పోలీసులు సంగారెడ్డి పట్టణంలో దాడులు నిర్వహించినా స్థానిక పోలీసులకు మాత్రం కనీస సమాచారం లేకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. దీంతో పట్టణవాసులు ఆందోళనకు గురయ్యారు. 

Updated Date - 2020-08-08T10:25:20+05:30 IST