బాలకార్మిక వ్యవస్థను రూపుమాపాలి
ABN , First Publish Date - 2022-07-06T05:07:45+05:30 IST
బాలకార్మిక వ్యవస్థను రూపుమాపాలి
మేడ్చల్, జూలై 5 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఆధునిక, సాంకేతిక కాలంలో కూడా బాల కార్మిక వ్యవస్థ కొనసాగడం సరికాదని, ఈ వ్యవస్థను రూపుమాపడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని అదనపు కలెక్టర్ ఏనుగు నర్సింహారెడ్డి అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో బాలకార్మిక వ్యవస్థపై అధికారుతో అదనపు కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఆపరేషన్ ముస్కాన్పై చర్చించారు. 18 సంవత్సరాల లోపు పిల్లలు ఎక్కడ పనిచేస్తున్నా వారిని గుర్తించాలని అదనపు కలెక్టర్ అధికారులను అదేశించారు. ప్రధానంగా కిరాణ దుకాణాలు, మెకానిక్, హోటళ్లు, భిక్షాటన జరిగే ప్రాంతాల్లో పిల్లలు కనిపిస్తారని, ఈ విషయాన్ని గుర్తించి వారికి విముక్తి కల్పించాలన్నారు. ఆపరేషన్ ముస్కాన్లో భాగంగా ఎన్ని కేసులు వచ్చాయి. ఎంతమంది పిల్లలకు రక్షణ కల్పించారు అనే అంశంపై ఎప్పటికప్పుడు నివేదికలు ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో రాచకొండ షీటీం డీసీపీ సలీమా, సీడబ్ల్యూసీ ఛైర్మన్ రాజిరెడ్డి, డీఆర్ఓ లింగ్యానాయక్, బాలల సంరక్షణ అధికారి ఎండీ ఇంతియాస్ రహీం, బాలల రక్షణ కో అర్డినేటర్ బి.నాగమణితో పాటు సీడీపీఓలు ఉదయశ్రీ, ప్రియాంక, సాయిసుమన్ తదితరులు పాల్గొన్నారు.