నకిలీ విత్తనాలతో మోసపోయాం...
ABN , First Publish Date - 2020-12-03T05:45:44+05:30 IST
మిర్చి విత్తనాలతో మోసపోయామని వేలేరు పాడు మండలంలో పలువురు రైతులు వాపోయారు.
వేలేరుపాడు, డిసెంబరు 2: మిర్చి విత్తనాలతో మోసపోయామని వేలేరు పాడు మండలంలో పలువురు రైతులు వాపోయారు. ఎన్డామ్–5 అనే మిర్చి కంపెనీకి చెందిన విత్తనాలను డీలర్ల నుంచి కొనుగోలు చేసి నారుమళ్లు పోశామని సరైన ఎదుగుదల లేక పోవడంతో పాటు తెగుళ్లు ఆశించి పంటలు దెబ్బతిన్నాయని, తెగుళ్ల నివారణకు మందులను పిచికారీ చేసినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయిందని, దీనిపై విత్తన డీలర్లను సంప్రదించగా వారు సరైన సమాదానం చెప్పకుండా తప్పించు కోవడంతో ఆందోళనకు దిగినట్టు తెలిపారు. బుధవారం రుద్రమకోట, రేపాకగొమ్ము గ్రామాల రైతులు దెబ్బతిన్న పంటను పీకివేసి తమకు న్యాయం చేయాలంటూ ధర్నా చేశారు. దీనిపై రైతులు కందికొండ పాండురంగారావు, రవిబాబు మాట్లాడుతూ భద్రాచలంలోని డీలర్ల వద్ద మిరప విత్తనాలను కొనుగోలు చేసి నారు పెంచేందుకు కుక్కునూరు మండలానికి చెందిన ఒక వ్యక్తికి అప్పగించామని సుమారు 40 ఎకరాలకు సరిపడా నారు తీసుకువచ్చి వేయగా మూడు నెలలు గడిచినా మొక్క ఎదగక పోగా తెగుళ్లతో పంటలు దెబ్బతిన్నాయని చెప్పారు. నకిలీ విత్తనాలు అమ్మిన డీలర్లపై అధికారులు చర్యలు తీసుకుని తమకు పరిహారం ఇప్పించాలని బాధిత రైతులు డిమాండ్ చేశారు.