ఖమ్మం మార్కెట్‌కు పోటెత్తిన మిర్చి

ABN , First Publish Date - 2021-03-09T08:58:52+05:30 IST

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు ఎర్ర బంగారం పోటెత్తింది. సోమవారం సుమారు 60 వేల బస్తాలను రైతులు అమ్మకానికి తీసుకొచ్చారు.

ఖమ్మం మార్కెట్‌కు పోటెత్తిన మిర్చి

ఖమ్మం మార్కెట్‌, మార్చి 8: ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు ఎర్ర బంగారం పోటెత్తింది. సోమవారం సుమారు 60 వేల బస్తాలను రైతులు అమ్మకానికి తీసుకొచ్చారు. మార్కెట్‌కు వానాకాలం సీజన్‌కు సంబంధించిన మిర్చి రావడం మొదలైన రోజు నుంచి ఇంత మొత్తంలో రావడం ఇదే ప్రథమం. శని, ఆదివారాలు సెలవులు రావడంతో సోమవారం పెద్ద మొత్తంలో రైతులు పంటను అమ్మకానికి తెచ్చారు. ఉదయం 6 గంటలకల్లా మిర్చి యార్డు బస్తాలతో నిండిపోయింది. మరోవైపు, భారీగా మిర్చి రావడంతో వ్యాపారులు టధరలు తగ్గించారు. క్వింటా రూ.14,500 జెండా పాటగా నిర్ణయించగా.. వ్యాపారులు మాత్రం కనిష్ఠంగా రూ.8,000 నుంచి రూ.10,000 వరకు, గరిష్ఠంగా రూ.11,000 నుంచి రూ.13,400 వరకు కొనుగోలు చేశారు. డీలక్స్‌ క్వాలిటీ ఉన్న పంటను కూడా క్వింటా రూ.13,000 వరకు మాత్రమే కొనుగోలు చేయడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గత శుక్రవారం రూ.15వేలపైన ధర పలికిందని.. సోమవారం ఎక్కువ మొత్తంలో రావడంతో వ్యాపారులు కావాలనే రూ.500 తగ్గించారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, తాలు మిర్చిని కనిష్ఠంగా రూ.5,000, గరిష్ఠంగా రూ.7,800.. నమూనా రకాలను రూ.6,500 వరకు కొనుగోలు చేశారు.

Updated Date - 2021-03-09T08:58:52+05:30 IST