చైనాలో విజృంభిస్తున్న కరోనా.. లాక్‌డౌన్ విధింపు

ABN , First Publish Date - 2022-03-12T00:15:06+05:30 IST

చైనాలో మరోసారి కరోనా విజృంభిస్తోంది. గడిచిన వారం రోజుల్లోనే వెయ్యికిపైగా కేసులు నమోదు కావడంతో అక్కడి ప్రభుత్వం లాక్‌డౌన్ విధించింది.

చైనాలో విజృంభిస్తున్న కరోనా.. లాక్‌డౌన్ విధింపు

చైనాలో మరోసారి కరోనా విజృంభిస్తోంది. గడిచిన వారం రోజుల్లోనే వెయ్యికిపైగా కేసులు నమోదు కావడంతో అక్కడి ప్రభుత్వం లాక్‌డౌన్ విధించింది. ఈశాన్య చైనాలోని జిలిన్ ప్రావిన్స్‌లో ఉన్న చాంగ్‌చున్ పట్టణంతోపాటు, అనేక ప్రాంతాల్లో ఇటీవల కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో చైనా ప్రభుత్వం లాక్‌డౌన్ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. శుక్రవారం ఒక్కరోజే 397 కరోనా కేసులు నమోదుకాగా, జిలిన్ ప్రాంతంలోనే 98 కేసులు నమోదయ్యాయి. దాదాపు రెండేళ్ల తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. శుక్రవారం నాటికి కేసుల సంఖ్య 1,369కి చేరింది. చాంగ్‌చున్ పట్టణ పరిధిలో దాదాపు 90 లక్షల మంది నివసిస్తున్నారు. దీంతో చాంగ్‌చున్ సిటీ మొత్తం ప్రస్తుతం లాక్‌డౌన్ కఠినంగా అమలు చేస్తున్నారు. విద్యాసంస్థలు, వ్యాపార సంస్థలు అన్నీ మూసి ఉన్నాయి. రెండు రోజులకు ఒకసారి, ఇంటి నుంచి ఒక్కరు మాత్రమే బయటకు రావడానికి అనుమతిస్తున్నారు. మరోవైపు కరోనా టెస్టులు కూడా విపరీతంగా చేస్తున్నారు.

Updated Date - 2022-03-12T00:15:06+05:30 IST