PAK 38 మిలియన్ డాలర్లు ఇవ్వాల్సిందే China డిమాండ్
ABN , First Publish Date - 2021-10-17T15:32:56+05:30 IST
పాకిస్థాన్లోని డసు హైడ్రోపవర్ ప్రాజెక్టులో పని చేసే
బీజింగ్ : పాకిస్థాన్లోని డసు హైడ్రోపవర్ ప్రాజెక్టులో పని చేసే తమ ఇంజినీర్లు బాంబు పేలుడు కారణంగా మరణించడంతో 38 మిలియన్ డాలర్లు నష్టపరిహారం చెల్లించాలని చైనా డిమాండ్ చేస్తోంది. ఈ డిమాండ్పై పాకిస్థాన్ విదేశీ వ్యవహారాలు, ఆర్థిక, హోం, జల వనరుల మంత్రిత్వ శాఖలు, చైనీస్ ఎంబసీ చర్చిస్తున్నట్లు సమాచారం.
డసు ప్రాజెక్టులో పని చేసే ఇంజినీర్లు, సిబ్బంది ప్రయాణిస్తున్న ఓ బస్సును 2021 జూలై 14న పేలుడు పదార్థాలతో వచ్చిన ఓ కారు ఢీకొట్టింది. దీంతో ఆ బస్సు ఓ లోయలో పడిపోయింది. అందులో ప్రయాణిస్తున్న 13 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో తొమ్మది మంది చైనీస్ ఇంజినీర్లు, ఇద్దరు స్థానికులు, ఇద్దరు ఫ్రాంటియర్ కానిస్టేబులరీ సిబ్బంది ఉన్నారు. దాదాపు 25 మందికి గాయాలయ్యాయి. ఈ దుర్ఘటన జరిగినప్పటి నుంచి డసు ప్రాజెక్టు పనులు ఆగిపోయాయని పాకిస్థాన్ జల వనరుల శాఖ కార్యదర్శి డాక్టర్ షహజేబ్ ఖాన్ బంగష్ తెలిపారు.
ఈ నేపథ్యంలో పాకిస్థాన్ ముందు చైనా భారీ డిమాండ్ పెట్టింది. తమ ఇంజినీర్లు మరణించినందుకు 38 మిలియన్ డాలర్లు నష్టపరిహారం చెల్లించాలని కోరింది. డసు ప్రాజెక్టు పనులను పునఃప్రారంభించడానికి ముందే ఈ పరిహారం చెల్లించాలని స్పష్టం చేసింది.
డసు ప్రాజెక్టుపైనా, చైనా డిమాండ్పైనా చర్చించేందుకు వివిధ మంత్రిత్వ శాఖల కార్యదర్శుల స్టీరింగ్ కమిటీ ఓ సబ్ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిసింది. చైనా డిమాండ్ సహేతుకం కాదని పాక్ చెప్తోంది.
ఈ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను చైనాకు చెందిన చైనా గెఝౌబా గ్రూప్ కార్పొరేషన్ చేపట్టింది. ఈ దుర్ఘటన తర్వాత ప్రాజెక్టు పనులను నిలిపేసింది. నష్టపరిహారం ప్యాకేజీ ప్రకటించే వరకు, చైనీయులకు మరింత భద్రత కల్పించే వరకు ఈ పనులను పునఃప్రారంభించబోమని తెలిపింది.