అరుణాచల్ప్రదేశ్ బాలుడి కిడ్నాప్పై స్పందించిన చైనా
ABN , First Publish Date - 2022-01-21T01:06:25+05:30 IST
అరుణాచల్ప్రదేశ్లోని అప్పర్ సియాంగ్ జిల్లాకు చెందిన 17 ఏళ్ల బాలుడిని చైనా పీపుల్స్
బీజింగ్: అరుణాచల్ప్రదేశ్లోని అప్పర్ సియాంగ్ జిల్లాకు చెందిన 17 ఏళ్ల బాలుడిని చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) అపహరించినట్టు వచ్చిన వార్తలపై చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ స్పందించింది. దేశంలోకి అక్రమంగా ఎవరూ ప్రవేశించకుండా సరిహద్దులను తమ ఆర్మీ నియంత్రిస్తుందని, చొరబాట్లను అణచివేస్తుందని పేర్కొంది.
అప్పర్ సియాంగ్ జిల్లాకు చెందిన మిరామ్ తరోణ్ అనే టీనేజర్ను భారత భూభాగం నుంచి చైనా ఆర్మీ మంగళవారం అపహరించిందని అరుణాచల్ ప్రదేశ్ ఎంపీ తాపిర్ గావో బుధవారం ఆరోపించారు. తరోణ్ స్నేహితుడు జానీ యైయింగ్ మాత్రం తప్పించుకుని అధికారులకు సమాచారం అందించడంతో విషయం వెలుగులోకి వచ్చిందన్నారు.
తరోణ్ ఆపహరణ వార్తలపై చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. ఈ విషయం గురించి తమకు తెలియదన్నారు. సరిహద్దుల వద్ద చైనా ఆర్మీ చాలా అప్రమత్తంగా ఉంటుందని పేర్కొన్నారు. అక్రమంగా దేశంలోకి రావడాన్ని, వెళ్లడాన్ని అణచివేస్తుందని చెప్పారు. కనిపించకుండా పోయిన తరోణ్ను గుర్తించేందుకు సాయపడాలని భారత ఆర్మీ కోరిన నేపథ్యంలో చైనా ఇలా స్పందించడం గమనార్హం.