మరో బిలియనీర్కు షాకిచ్చిన చైనా! చూస్తుండగానే అంతా తల్లకిందులు!
ABN , First Publish Date - 2021-07-26T21:53:51+05:30 IST
చైనా అపరకుబేరులకు అక్కడి ప్రభుత్వం చుక్కలు చూపిస్తోంది. ప్రభుత్వం ఇచ్చిన షాక్తో అలీబాబా సంస్థ అధినేత జాక్ మా సైలెంట్ అయిపోయిన విషయం తెలిసిందే. తాజాగా మరో సంపన్నుడు.. కమ్యూనిస్టు ప్రభుత్వం దెబ్బకు బొక్కబోర్లాపడ్డారు.
బీజింగ్: చైనా అపరకుబేరులకు అక్కడి ప్రభుత్వం చుక్కలు చూపిస్తోంది. ప్రభుత్వం ఇచ్చిన షాక్తో అలీబాబా సంస్థ అధినేత జాక్ మా సైలెంట్ అయిపోయిన విషయం తెలిసిందే. తాజాగా మరో సంపన్నుడు.. కమ్యూనిస్టు ప్రభుత్వం దెబ్బకు బొక్కబోర్లాపడ్డారు. చైనా ప్రభుత్వం ఇచ్చిన ఝలక్తో ఆయన కంపెనీ షేర్ల విలువ భారీగా పతనమైంది. దీంతో..అపరకుబేరుడిగా ఓ వెలుగు వెలిగిన ఆయన ప్రస్తుతం పాతాళానికి పడిపోయారు. ఇప్పుడు ఆయన సంపద విలువ కేవలం 333 మిలియన్ డాలర్లు మాత్రమే. చూడటానికి ఈ మొత్తం పెద్దదిగా ఉన్నప్పటికీ పూర్వ వైభవంతో పోలిస్తే..ఇది నామమాత్రమేనని మార్కెట్ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకూ ఆయన దాదాపు 15 బిలియన్ డాలర్ల సంపదను కోల్పోయారు. కంపెనీ షేర్ల విలువ ఈ ఏడాది జనవరితో పోలిస్తే ఏకంగా 98 శాతం మేర పడిపోయింది. ఎడ్యూటెక్ రంగంలో ఉన్న ల్యారీ చెన్.. గావ్టూ టెక్ ఎడ్యూ అనే సంస్థ ద్వారా ఆన్లైన్లో విద్యను అందిస్తున్నారు. ఈ క్రమంలో సంస్థ వేగంగా విస్తరించి ల్యారీపై కనకవర్షం కురిపించింది. ఈ ఎడ్యూటెక్ రంగంపై చైనా ఇటీవల దృష్టి సారించింది. హైస్కూల్ స్థాయి విద్యా బోధన అందించే ఇటువంటి సంస్థలు లాభాల కోసం వ్యాపారం చేయకూడదని, స్టాక్ మార్కెట్లు లేదా ఇతర మార్గాల్లో నిధులు సేకరించకూడదంటూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో..ల్యారీ కంపెనీ షేర్లు ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి.