Nancy Pelosi: అమెరికాతో అత్యున్నతస్థాయి మిలటరీ చర్చలను నిలిపివేసిన చైనా
ABN , First Publish Date - 2022-08-05T23:24:47+05:30 IST
అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ (Nancy Pelosi) తైవాన్ పర్యటనను తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చిన
బీజింగ్: అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ (Nancy Pelosi) తైవాన్ పర్యటనను తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చిన చైనా అగ్గి మీద గుగ్గిలం అవుతోంది. అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటామని ఇప్పటికే ప్రతినబూనిన డ్రాగన్ కంట్రీ.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇరు దేశాల మధ్య జరగాల్సిన అత్యున్నత స్థాయి సైనిక కమాండర్ల చర్చలు, వాతావరణ మార్పులపై చర్చలను నిలిపివేసింది. అలాగే, పలు రంగాల్లో సహకారాన్ని నిలిపివేస్తున్నట్టు తెలిపింది.
సరిహద్దు నేరాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణాను నిరోధించడం, అక్రమ వలసదారులను స్వదేశానికి రప్పించడం వంటి ఎనిమిది నిర్దిష్ట చర్యల విషయంలో అమెరికా(US)తో సహకారాన్ని నిలిపివేస్తున్నట్టు చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ తెలిపింది. ఆసియా పర్యటనలో భాగంగా పెలోసీ జపాన్ (Japan) బయలుదేరిన కాసేపటికే చైనా ఈ ప్రకటన విడుదల చేయడం గమనార్హం.
అలాగే, సముద్ర సైనిక భద్రతా యంత్రాంగంపై ప్రణాళికబద్ధమైన సమావేశాన్ని కూడా చైనా రద్దు చేసింది. మరోవైపు, పెలోసీపై చైనా ప్రత్యేకంగా ఆంక్షలు విధించింది. ఆమె ‘దుర్మార్గపు’, ‘రెచ్చగొట్టే’ చర్యలను నిరసిస్తూ పెలోసీ, ఆమె కుటుంబ సభ్యులపై ప్రత్యేకంగా ఆంక్షలు విధిస్తున్నట్టు పేర్కొంది. అయితే, అవి ఎలాంటి ఆక్షలన్న విషయంలో స్పష్టత లేదు.