గ్రహాంతర వాసుల నుంచి China కు సిగ్నల్స్?

ABN , First Publish Date - 2022-06-15T19:18:46+05:30 IST

భూగ్రహానికి వెలుపల నుంచి చైనా టెలిస్కోప్‌కు అందిన సంకేతాలు గ్రహాంతరవాసులు పింపినవే అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

గ్రహాంతర వాసుల నుంచి China కు సిగ్నల్స్?

బీజింగ్ : భూగ్రహానికి వెలుపల నుంచి చైనా టెలిస్కోప్‌కు అందిన సంకేతాలు గ్రహాంతరవాసులు పంపించినవేనా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తమ దేశానికి చెందిన భారీ టెలిస్కోప్ ‘స్కై ఐ’ ఇటివల తక్కువ స్థాయి-బ్యాండ్ ఎలక్ట్రోమేగ్నెటిక్ సిగ్నల్స్‌ను గుర్తించిందని చైనా వెల్లడించింది. ఈ సంకేతాలు గ్రహాంతరవాసుల నుంచే వచ్చివుండొచ్చని చైనా సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్ట్రీ అధికారి న్యూస్‌పేపర్‌కు చెందిన వెబ్‌సైట్‌లో ఒక రిపోర్టును ప్రచురించింది. కానీ ఆ తర్వాత రిపోర్ట్, పోస్టును డిలీట్ చేసింది. రిపోర్టును ఎందుకు డిలీట్ చేసిందానేది తెలియరాలేదు. కాకపోతే డిలీట్ చేసేలోపే చైనా మైక్రోబ్లాకింగ్ నెట్‌వర్క్ ‘విబో’పై ఈ రిపోర్ట్ వైరల్‌గా మారింది. ఆ తర్వాత ఇతర మీడియా సంస్థలకు కూడా చేరడంతో రిపోర్టును వెల్లడించాయి.


రిపోర్టులో పేర్కొన్నదాని ప్రకారం... ప్రపంచంలోనే అతిపెద్ద రేడియో టెలీస్కోప్ ‘స్కై ఐ’కి అందిన సిగ్నల్స్  గ్రహాంతర వాసులవే కావొచ్చని, ఇదివరకు గుర్తించినవాటితో పోల్చితే ఇవి భిన్నంగా ఉన్నాయని గ్రహాంతర వాసుల అన్వేషణపై అధ్యయనం చేస్తున్న బృందం చీఫ్ సైంటిస్ట్ జాంగ్ టోన్‌జీ తెలిపారు. ఈ సిగ్నల్స్‌పై తమ శాస్త్రవేత్తల బృందం లోతైన అధ్యయనం కొనసాగించనుందని తెలిపారు. టెలీస్కోప్ గుర్తించిన అనుమానిత సిగ్నల్స్.. ఒక రకమైన రేడియో ఇంటర్‌ఫియరెన్స్(రెండు లేదా అంతకంటే ఎక్కువ తరంగాల కలయిక) అయ్యి వుండొచ్చని అభిప్రాయాలున్నాయి. ఈ సిగ్నల్స్‌పై తదుపరి పరిశోధన చేయాల్సి ఉందని జాంగ్ వివరించారు. బీజింగ్ నార్మల్ యూనివర్సిటీ, నేషనల్ అస్ట్రోనామికల్ అబ్సర్వేటరీ ఆఫ్ చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, బెర్కీల ఉమ్మడిగా ఏర్పాటు చేసిన అధ్యయన బృందానికి జాంగ్ టోన్‌జీ నేతృత్వం వహిస్తున్నారు. 


 కాగా నైరుతి చైనాలోని గిజువూ ప్రావిన్స్‌లో ‘స్కై ఐ’ టెలిస్కోప్ ఉంది. దీని వ్యాసం ఏకంగా 500 మీటర్లు(1640 అడుగులు)గా ఉంది. గ్రహాంతర వాసుల ఉనికిపై అధ్యయనం కోసం సెప్టెంబర్ 2020లో అధికారికంగా ప్రారంభించారు. ఇక్కడ పనిచేస్తున్న శాస్త్రవేత్తల బృందం 2020లో రెండు జతల ఏలియన్  అనుమానాస్పద సిగ్నల్స్‌ను గుర్తించింది. ఆ తర్వాత 2022లో కూడా సిగ్నల్స్ అందాయని జాంగ్ తెలిపినట్టు రిపోర్టు పేర్కొంది.

Updated Date - 2022-06-15T19:18:46+05:30 IST