China Ship Heads For Hambantota Port: భారత్‌పై నిఘా కోసం శ్రీలంకకు చైనా కీలక నౌక

ABN , First Publish Date - 2022-08-05T03:20:56+05:30 IST

న్యూఢిల్లీ: అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ పెలోసి (US House of Representatives Speaker Nancy Pelosi) తైవాన్‌ (Taiwan) పర్యటనను సాకుగా చేసుకుని చైనా తన వ్యూహాలకు పదునుపెడుతోంది.

China Ship Heads For Hambantota Port: భారత్‌పై నిఘా కోసం శ్రీలంకకు చైనా కీలక నౌక

న్యూఢిల్లీ: అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ పెలోసి (US House of Representatives Speaker Nancy Pelosi) తైవాన్‌ (Taiwan) పర్యటనను సాకుగా చేసుకుని చైనా (china) తన వ్యూహాలకు పదునుపెడుతోంది. యుద్ధ విన్యాసాల పేరుతో ఏకకాలంలో తన ప్రత్యర్థులందరినీ హడలెత్తించడమే కాక భారత్‌పై కూడా నిఘా పెడుతోంది. చైనాకు చెందిన కీలక యువాన్ వాంగ్ క్లాస్ షిప్‌ను శ్రీలంకలోని హంబన్ తోట ఓడరేవుకు పంపుతోంది. ఈ నెల 11, 12 తేదీల కల్లా ఈ నౌక  హంబన్ తోట ఓడరేవుకు చేరుకుంటుంది.


మొత్తం 4 వందల మంది సిబ్బంది ఈ నౌకలో ఉంటారు. దీన్ని చైనా అంతరిక్ష విభాగంతో పాటు సైనిక విభాగం అధికారులు నియంత్రిస్తుంటారు. అత్యంత అధునాతన టెక్నాలజీ ఇందులో ఉండటంతో ఈ నౌక ద్వారా ఒడిశా తీరం వెంబడి వీలర్ ఐలాండ్‌లో భారత్ చేపట్టే బాలిస్టి‌క్ క్షిపణి ప్రయోగాలను అంచనా వేయడానికి, వాటి సామర్థ్యంపై పూర్తి వాస్తవ స్థాయి సమాచారాన్ని రాబట్టుకోవడానికి చైనాకు వీలవుతుంది. అంటే భారత క్షిపణుల రేంజ్‌ను కచ్చితంగా అంచనా వేయడానికి ఈ నౌక ద్వారా చైనాకు వీలు చిక్కుతుంది. చైనాకు చెందిన ఈ నౌకను శ్రీలంక అనుమతించడంపై భారత్ ఆందోళనగా ఉంది. శ్రీలంక ప్రస్తుతం ఎదుర్కొంటోన్న ఆర్ధిక సంక్షోభం నుంచి కాపాడేందుకు చేయాల్సినంత చేస్తున్నా ఆ దేశం భారత్‌కు ఈ విషయంలో సహకరించలేకపోవచ్చని సమాచారం. ఈ నౌక వస్తున్నది శ్రీలంక ఆధీనం నుంచి చైనా పరమైన హంబన్ తోట ఓడరేవుకు కావడంతో శ్రీలంక ప్రభుత్వం నిస్సహాయతను వ్యక్తం చేసే అవకాశం ఉంది.  

 

హంబన్ తోట ఓడరేవు నిర్మాణానికి శ్రీలంక 2009లో చైనా నుంచి భారీగా రుణాలు తీసుకుంది. తిరిగి చెల్లించలేకపోయింది.  దీంతో 2017లో హంబన్ తోట ఓడరేవును 99 ఏళ్లపాటు చైనాకు లీజుగా అప్పగించింది. ఈ రేవును చైనీయులకు అప్పగించడం ద్వారా వచ్చిన డబ్బులో కొంత భాగాన్ని ఇతర రుణాల చెల్లింపునకు వాడామని అప్పటి శ్రీలంక ప్రభుత్వం చెప్పుకుంది. రాజపక్స సోదరులు చైనాకు అనుకూలంగా వ్యవహరించడం వల్లే హంబన్ తోట ఓడరేవు శ్రీలంక చేతుల నుంచి చైనీయుల పరమైందనేది జగమెరిగిన సత్యం. 


చైనా నౌక హంబన్ తోట ఓడరేవుకు చేరుకోకుండా భారత్ శ్రీలంకపై తీవ్రంగా ఒత్తిడి చేసే అవకాశం ఉంది. 

Updated Date - 2022-08-05T03:20:56+05:30 IST