చైనా కీలక ప్రకటన.. భారతీయ విద్యార్థులకు భారీ ఊరట..

ABN , First Publish Date - 2022-04-30T03:29:02+05:30 IST

చైనాలో చదువుకుంటున్న భారతీయులకు ఓ గుడ్ న్యూస్! త్వరలో భారతీయ విద్యార్థులను మళ్లీ తమ దేశంలోకి అనుమతిస్తామని చైనా తాజాగా ప్రకటించింది. ఈ దిశగా వీసా జారీ ప్రక్రియ పునఃప్రారంభించబోతున్నట్టు తెలిపింది. చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి జావ్ లిజియన్ శుక్రవారం ఈ మేరకు ఓ కీలక ప్రకటన చేశారు.

చైనా కీలక ప్రకటన.. భారతీయ విద్యార్థులకు భారీ ఊరట..

ఎన్నారై డెస్క్: చైనాలో చదువుకుంటున్న భారతీయులకు ఓ గుడ్ న్యూస్!  త్వరలో భారతీయ విద్యార్థులను మళ్లీ తమ దేశంలోకి అనుమతిస్తామని చైనా తాజాగా ప్రకటించింది. ఈ దిశగా వీసా జారీ ప్రక్రియ పునఃప్రారంభించబోతున్నట్టు తెలిపింది.  చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి జావ్ లిజియన్ శుక్రవారం ఈ మేరకు  ఓ కీలక ప్రకటన చేశారు. ‘‘భారతీయ విద్యార్థులకు చైనా ఎంతో ప్రాధాన్యమిస్తుంది’’ అని కూడా వ్యాఖ్యానించారు. కరోనా సంక్షోభం తొలి నాళ్లలో చైనాలో చదువుకుంటున్న భారతీయ విద్యార్థులు స్వదేశానికి తిరిగొచ్చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత.. విదేశీయులను తమ దేశంలోకి అనుమతించేది లేదంటూ చైనా కరోనా ఆంక్షలు విధించింది. గత రెండేళ్లుగా ఈ ఆంక్షలు అమల్లో ఉండటంతో భారత విద్యార్థులు ఎన్నో అవస్థలు పడ్డారు. ఆన్‌లైన్ మాధ్యమంలో జరుగుతున్న క్లాసుల వల్ల ఆశించిన ఉపయోగం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.  


మరోవైపు.. ఇతర దేశాల వారికి ఇటీవల కాలంలో వీసాల జారీ మొదలు పెట్టిన చైనా.. భారతీయుల విషయంలో మాత్రం తాత్సారం చేస్తూ వచ్చింది. ఈ విషయమై భారత్ పలుమార్లు తీవ్రస్థాయిలో తన అభ్యంతరాలను వ్యక్తం చేసింది. దీంతో..తీరు మార్చుకున్న చైనా భారతీయ విద్యార్థులకు మళ్లీ వీసాలు జారీ చేసేందుకు సిద్ధమైంది. అయితే.. చైనాలో తప్పనిసరిగా చదవాల్సిన విద్యార్థుల జాబితాను పంపిచాలంటూ భారత్‌కు చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి సూచించడం కొసమెరుపు.  ఇక చైనా యూనివర్శిటీల్లో సుమారు 23 వేల మంది భారతీయ విద్యార్థులు చదువుకుంటున్నట్టు ఓ అంచనా.

Updated Date - 2022-04-30T03:29:02+05:30 IST