చైనా కరోనా టీకా దిగదుడుపే.. శాస్త్రవేత్తల్లో ఆందోళన!

ABN , First Publish Date - 2021-07-24T21:32:59+05:30 IST

వృద్ధుల్లో చైనా కరోనా టీకా పనితీరు నిరాశాజనకంగా ఉందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. చైనా సంస్థ సైనోఫార్మ్ రూపొందించిన టీకా.. వయోజనులకు చాలా తక్కువ స్థాయి రక్షణ ఇస్తోందని హంగరీ శాస్త్రవేత్తలు జరిపిన అధ్యయనం తేల్చింది.

చైనా కరోనా టీకా దిగదుడుపే.. శాస్త్రవేత్తల్లో ఆందోళన!

న్యూఢిల్లీ: వృద్ధుల్లో చైనా కరోనా టీకా పనితీరు నిరాశాజనకంగా ఉందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. చైనా సంస్థ సైనోఫార్మ్ రూపొందించిన టీకా.. వయోజనులకు చాలా తక్కువ స్థాయి రక్షణ ఇస్తోందని హంగరీ దేశంలో జరిగిన అధ్యయనం తేల్చింది.  మొత్తం 450 మందిపై ఇద్దరు హంగరీ శాస్త్రవేత్తలు ఈ అధ్యయనం నిర్వహించారు. టీకా రెండో డోసు తీసుకున్న 2 వారాలకు వారి రక్త నమూనాలను యాంటీబాడీల కోసం పరీక్షించారు. ఈ క్రమంలో 50 ఏళ్ల లోపు వయసున్న 90 శాతం మందిలో యాంటీబాడీలు అభివృద్ధి చెందినట్టు..వయోజనుల్లో మాత్రం వారి వయసును బట్టి యాంటీబాడీలు స్థాయిలు తగ్గినట్టు నిపుణులు గుర్తించారు.  ఈ క్రమంలో 80 ఏళ్లు పైబడిన 50 శాతం మందిలో అసలు ఎటువంటి యాంటీబాడీలు లేకపోవడంతో శాస్త్రవేత్తలను ఆందోళన చెందుతున్నారు. 


‘‘కరోనా కారణంగా అత్యధిక ప్రమాదం ఎదుర్కొంటున్న వృద్ధుల్లోనే టీకా తీసుకున్నాక  యాంటీబాడీలు లేకపోవడం చాలా ఆందోళనకరం’’ అని హాంకాంగ్ యూనివర్శిటీకి చెందిన వైరాలజీ శాస్త్రవేత్త డా. జిన్ డాంగ్-యాన్ వ్యాఖ్యానించారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. వ్యక్తుల యాంటీబాడీల స్థాయిలను బట్టి కరోనా నుంచి వారికి ఏ స్థాయి రక్షణ ఉందనేది నేరుగా నిర్ణయించలేము. అయితే.. కరోనా రక్షణ స్థాయికి సంబంధించి దీన్ని ఓ సంకేతంగా భావించాలని పలు  అధ్యయనాలు రుజువుచేశాయి. మరోవైపు.. ఈ అధ్యయనంలో వినియోగించిన కరోనా టెస్టింగ్ కిట్ల కచ్చితత్వంపై కూడా కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా.. ఈ అధ్యయనంపై స్పందించేందుకు చైనా నిరాకరించింది. పెద్ద పరిశోధన సంస్థలు, లేదా ప్రభుత్వాల కనుసన్నల్లో జరిగిన పరిశోధనలపైనే స్పందిస్తామని తేల్చి చెప్పింది.

Updated Date - 2021-07-24T21:32:59+05:30 IST