సీరం ఇన్‌స్టిట్యూట్, భారత్ బయోటెక్‌‌‌పై చైనా హ్యాకింగ్..?

ABN , First Publish Date - 2021-03-02T01:00:04+05:30 IST

టీకా దౌత్యంలో భారత్‌తో పోటీ పడలేక చైనా కొత్త వ్యూహాన్ని అమలు చేస్తోంది భారత్ తయారు చేస్తున్న టీకాల సమాచారాన్ని తస్కరించేందుకు ప్రయత్నిస్తోందని తాజాగా వెల్లడైంది.

సీరం ఇన్‌స్టిట్యూట్, భారత్ బయోటెక్‌‌‌పై చైనా హ్యాకింగ్..?

న్యూఢిల్లీ: భారత్‌లో తయారవుతున్న కరోనా టీకా వివరాలను సేకరించేందుకు చైనా వర్గాలు హ్యాకింగ్‌కు పాల్పడినట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. చైనాలోని ఓ హ్యాకింగ్ గ్రూప్.. సీరం ఇన్‌స్టిట్యూట్ భారత్ బయోటెక్‌లను టార్గెట్ చేసుకున్నట్టు తెలుస్తోంది. కొవిషీల్డ్ టీకా వివరాలను దొంగిలించేందుకు చైనా సీరం ఇన్‌స్టిట్యూట్‌ కంప్యూటర్లలోకి మాల్ వేర్ ప్రవేశపెట్టిందని సైబర్ సెక్యురిటీ సంస్థ  సైఫర్మా తాజాగా ప్రకటించింది. భారత్‌లో కరోనా టీకాలు తయారు చేస్తున్న సీరం ఇన్‌స్టిట్యూట్, భారత్ బయోటెక్ ఐటీ వ్యవస్థల్లోకి మాల్ వేర్ చొప్పించిందని ఆ సంస్థ తాజాగా ప్రకటించింది. చైనా హ్యాకింగ్ గ్రూప్ స్టోన్ పాండా.. సీరం, భారత్ బయోటెక్ ఐటీ వ్యవస్థల్లోని లోపాలను గుర్తించి మాల్‌వేర్ చొప్పించిందని సదరు సంస్థ పేర్కొంది. టీకాలకు సంబంధించిన మోధోసంపత్తి హక్కుల వివరాలను తస్కరించి భారత ఫార్మా కంపెనీలపై పైచేయి సాధించాలనేది ఇక్కడి లక్ష్యం అని  సైఫర్మా ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. సీరం ఐటీ వ్యవస్థలను క్షుణ్ణంగా పరిశీలిస్తోందన్నారు. సీరం ఇన్ స్టిట్యూట్‌కు చెందిన అనేక పబ్లిక్ సర్వర్ల సెక్యురిటీ వ్యవస్థలు బలహీనంగా ఉన్నాయని స్టోన్ పాండా గుర్తించినట్టు ఆయన తెలిపారు. 


భారత్ చైనాలు ప్రస్తుతం పోటాపోటీగా కరోనా టీకాలను ఉత్పత్తి చేస్తున్న విషయం తెలిసిందే. అయితే..ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అమ్ముడవుతున్న టీకాల్లో 60 శాతం భారత్‌లోనే తయారైనవి కావడంతో టీకా దౌత్యంలో భారత్ చైనాపై పైచేయి సాధించిందనే వ్యాఖ్యలు సర్వత్రా వినవస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత్‌ టీకా వివరాలను చైనా తసర్కించేందుకు ప్రయత్నించిందంటూ వస్తున్న వార్తలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ వివరాలను తాము భారత్ ఇంటెలిజెన్స్ వర్గాలకు తెలిపినట్టు కూడా సైఫర్మా తెలిపింది. 


అయితే..దీనిపై అటు చైనా గానీ..ఇటు భారత్ ఇంటెలిజెన్సు వార్గాలు కానీ ఎటువంటి ప్రకటనా విడుదల చేయలేదు. ఇక సీరం, భారత్ బయోటెక్ సంస్థలు కామెంట్ చేసేందుకు నిరాకరించాయి. ప్రముఖ టెక్ సంస్థ మైక్రోసాఫ్ట్ కూడా నవంబర్‌లోనే ఇటువంటి దాడుల గురించి హెచ్చరించింది. రష్యా, ఉత్తరకొరియా కేంద్రంగా కొన్ని హ్యాకింగ్ గ్రూపులు.. భారత్, కెనడా, ఫ్రాన్స్,  దక్షిణకొరియా, అమెరికాలకు చెందిన ఫార్మా కంపెనీలను టార్గెట్ చేసుకున్నాయని తెలిపింది. ఉత్తరకొరియా హ్యాకర్లు బ్రిటన్ ఫార్మా కంపెనీ ఆస్ట్రాజెనెకాను కూడా టార్గెట్ చేసుకున్నారని తెలిపింది. ఇక హ్యాకింగ్ గ్రూప్ స్టోన్ పాండా  చైనా అంతర్గత భద్రతా మంత్రిత్వ శాఖతో కలిసి పనిచేస్తోందని అమెరికా డిపార్టమెంట్ ఆఫ్ జస్టిస్ 2018లోనే కుండబద్దలు కొట్టింది. ఐరోపా ఔషధ నియంత్రణ సంస్థపై గతేడాది డిసెంబర్‌లో జరిగిన దాడిలో తమ టీకాకు సంబంధించిన కీలక డాక్యుమెంట్లు లీకైయ్యాయని ఫైజర్ టీకాకు కూడా గతంలో ప్రకటించింది. 

Updated Date - 2021-03-02T01:00:04+05:30 IST