ఆర్‌ఆర్‌ఆర్‌ నిర్మాణంపై చిన్నగుండవెల్లి వాసుల నిరసన

ABN , First Publish Date - 2022-10-01T04:45:45+05:30 IST

సిద్దిపేటఅర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(సుడా) ఆధ్వర్యంలో సిద్దిపేట పట్టణంతో పాటు సమీప గ్రామాలను కలుపుతూ రీజనల్‌రింగ్‌రోడ్డు నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల సుడా అధికారులు రీజనల్‌ రింగ్‌రోడ్డుకు సంబంధించిన డ్రాప్ట్‌ మ్యాప్‌ను విడుదల చేశారు.

ఆర్‌ఆర్‌ఆర్‌ నిర్మాణంపై చిన్నగుండవెల్లి వాసుల నిరసన
చిన్నగుండవెల్లిలోని ప్రధాన రహదారిపై వంటావార్పు నిర్వహిస్తున్న గ్రామస్థులు

రోడ్డుపై వంటావార్పు

ఇప్పటికే భూములు కోల్పోయామని ఆవేదన


సిద్దిపేటరూరల్‌, సెప్టెంబరు 30: సిద్దిపేటఅర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(సుడా) ఆధ్వర్యంలో సిద్దిపేట పట్టణంతో పాటు సమీప గ్రామాలను కలుపుతూ రీజనల్‌రింగ్‌రోడ్డు నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల సుడా అధికారులు రీజనల్‌ రింగ్‌రోడ్డుకు సంబంధించిన డ్రాప్ట్‌ మ్యాప్‌ను విడుదల చేశారు. దీన్ని వ్యతిరేకిస్తూ సిద్దిపేటరూరల్‌ మండల పరిధిలోని చిన్నగుండవెల్లి గ్రామ బాధిత రైతులు శుక్రవారం నిరసన వ్యక్తం చేయడంతో పాటు రోడ్డుపై వంటావార్పు చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామస్థులు మాట్లాడుతూ.. ఇప్పటికే గ్రామంలోంచి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కెనాలు, కాలువలు నిర్మించారని, అనేక మంది రైతులు తమ భూములు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో ఎలాంటి సర్వే చేయకుండా, గ్రామపంచాయతీకి నోటీసులు, సమాచారం ఇవ్వకుండా ఆరులేన్ల రింగురోడ్డు, కాలువలు నిర్మిస్తున్నట్లు డ్రాప్ట్‌ను విడుదల చేయడం దారుణమన్నారు. గతంలో కూడా మల్లన్నసాగర్‌ సొరంగం, అదనపు టీఎంసీల తరలింపునకు కాలువలు గ్రామంలో నుంచి వెళ్లాయని, వాటి వల్ల ఎంతో మంది రైతులు భూములు కోల్పోయారన్నారు. మళ్లీ ఇప్పుడు డ్రాప్ట్‌ మ్యాప్‌ (రిజినల్‌ రింగ్‌ రోడ్డు) పేరుతో రైతులను ఇబ్బందులకు గురిచేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. మంత్రి హరీశ్‌రావు, సుడా అధికారులు, సుడా చైర్మన్‌ జోక్యం చేసుకుని చిన్నగుండవెల్లి గ్రామస్థులకు అన్యాయం జరగకుండా తగు చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. సుడా అధికారులు విడుదల చేసిన డ్రాప్ట్‌ మ్యాప్‌ పూర్తి వివరాలతో కూడిన అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయాలని కోరారు. నిరనన తెలిపిన వారిలో రైతులు దొంతిరెడ్డి పటేల్‌ రెడ్డి, మల్లమ్మగారి శ్రీనివాస్‌రెడ్డి, పుల్లగూర్ల బాపురెడ్డి, కోటగిరి రమేష్‌గౌడ్‌, గణేష్‌ గౌడ్‌, కానుగుల శ్రీనివాస్‌, మిరుదొడ్డి భద్రయ్య, గడీల పద్మారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, కనుమూరు లక్ష్మి, వెంకటరెడ్డి, ఎర్రోళ్ల బుచ్చయ్య, తదితరులు ఉన్నారు. 

Updated Date - 2022-10-01T04:45:45+05:30 IST