చిన్నికృష్ణే.. పెద్ద దిక్కు!
ABN , First Publish Date - 2021-05-09T05:30:00+05:30 IST
ఓ యువకుడు..
ఓ గెజిటెడ్ అధికారి ఔదార్యం
‘కొవిడ్’ బాధితుల సేవలో నిమగ్నం
(పలాస): కాశీబుగ్గకు చెందిన ఓ యువకుడు కరోనా బారిన పడి ఇటీవల మృతి చెందాడు. అందరూ ఉన్నా, మృతదేహాన్ని తాకడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. అధికారులు దూరం నుంచే మృతదేహాన్ని చూసి ఎస్.చిన్నికృష్ణ అనే ఓ వ్యక్తికి ఫోన్ ద్వారా సమాచారం అందించారు. అంతే.. సొంత వాహనంపై ఆయన ఠక్కున అక్కడికివచ్చి వాలిపోయారు. పీపీఈ కిట్ ధరించి.. ఎటువంటి సందేహం లేకుండా మృతదేహాన్ని భుజంపై మోసి.. అంత్యక్రియలు పూర్తిచేశారు. ఈ యువకుడికే కాదు.. పలాస నియోజకవర్గంలో ఇటీవల కొవిడ్ బారిన పడి మృతిచెందినవారిలో చాలా మందికి ఆయనే దగ్గరుండి అంత్యక్రియలు నిర్వహించారు. ఆపద వేళ మృతుల కుటుంబాలకు సేవలందించి.. ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు ఎస్.చిన్నికృష్ణ.
ఆయన సాధారణమైన వ్యక్తి కాదు. రాష్ట్ర ప్రభుత్వ శాఖకు అనుసంధానంగా ఉన్న వ్యవసాయ మార్కెట్ కమిటీలో కార్యదర్శి(గెజిటెడ్)గా పనిచేస్తున్నారు. ఆయనకు నెలకు రూ.లక్షకు పైగా వేతనం వస్తుంది. అయినా ఉద్యోగ హోదా, దర్పం, గర్వం, కొవిడ్ వ్యాప్తి భయం వంటివి లేకుండా కరోనా బాధితులపై ఔదార్యం చూపుతున్నారు. పలాస-కాశీబుగ్గ సమీపంలోని కోసంగిపురం జంక్షన్ వద్ద లలితాఛారిటబుల్ ట్రస్టు నిర్వహిస్తూ వృద్ధులకు, గోవులకు సేవ చేస్తున్నారు. ఇటు విధుల నిర్వహణతో పాటు కుటుంబ సభ్యుల సహకారంతో సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. యాచకులు, అనాఽథలు, ప్రస్తుతం కొవిడ్ మృతులు.. ఇలా అందరికి చిన్నికృష్ణే పెద్దదిక్కుగా నిలుస్తున్నారు.