చిరుజల్లులు.. అన్నదాతల్లో గుబులు!
ABN , First Publish Date - 2020-11-27T04:54:14+05:30 IST
నివర్ తుఫాన్ కారణంగా జిల్లావ్యాప్తంగా గురువారం చిరుజల్లులు కురిశాయి. రోజంతా ఎడతెరిపిలేని వానతో పాటు చలిగాలులు కూడా వీచాయి.
తుఫాన్ కారణంగా జిల్లాలో వర్షం
పంటలపై ‘నివర్’ ప్రభావం
వాతావరణ శాఖ హెచ్చరికలతో అధికారులు అప్రమత్తం
వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు సూచన
(ఆంధ్రజ్యోతి బృందం)
నివర్ తుఫాన్ కారణంగా జిల్లావ్యాప్తంగా గురువారం చిరుజల్లులు కురిశాయి. రోజంతా ఎడతెరిపిలేని వానతో పాటు చలిగాలులు కూడా వీచాయి. దీంతో జిల్లావాసులు ఇళ్లకే పరిమితమయ్యారు. మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే సుమారు 40 శాతం వరి కోతలు జరగ్గా, పంటను రక్షించుకోవడానికి అష్టకష్టాలు పడుతున్నారు. డెంకాడ మండలంలో సుమారు వెయ్యి ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లినట్టు అధికారులు తెలిపారు. ఈ వర్షాలకు పత్తి పంటకూ నష్టం తప్పదని రైతులు భావిస్తున్నారు. ఇక తీరప్రాంత వాసులు అధికారులు అప్రమత్తం చేశారు. సముద్రంలో అలల తీవ్రత ఎక్కువగా ఉండటంతో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించారు.