కన్న కుమార్తెలను బలి ఇచ్చి ప్రయోగానికి నాంది పలికారు..

ABN , First Publish Date - 2021-01-25T16:09:10+05:30 IST

చిత్తూరు జిల్లా: అందరితో హుందాగా కలివిడిగా ఉండే పురుషోత్తం నాయుడు కేవలం పది రోజుల వ్యవధిలోనే..

కన్న కుమార్తెలను బలి ఇచ్చి ప్రయోగానికి నాంది పలికారు..

చిత్తూరు జిల్లా: అందరితో హుందాగా కలివిడిగా ఉండే పురుషోత్తం నాయుడు కేవలం పది రోజుల వ్యవధిలోనే తన ప్రవర్తనలో మార్పు వచ్చింది. తాను వారం రోజులు దీక్షలో ఉంటానని, ఉద్యోగానికి సెలవు పెట్టి, ఎవరు ఫోన్ కాల్ చేయొద్దని చెప్పినట్టు పురుషోత్తం నాయుడు కొలీగ్స్ తెలిపారు. మెహర్ బాబా, ఓషో భక్తులైన పురుషోత్తం నాయుడు, భార్య పద్మజ తమ కుమార్తెలను కూడా వీరి భక్తులుగా మార్చారు. శివుడి కేశంలో నుంచి పుట్టిందే కరోనా అని, ఈ కలియుగం అనంతరం తామే చనిపోయిన వ్యక్తులను బతికిస్తామని  ఈ ప్రయోగానికి ఒడిగట్టారని తెలుస్తోంది. కన్న కుమార్తెలను బలి ఇచ్చి ప్రయోగానికి నాంది పలికారు. తాము కూడా ప్రాణార్పణ చేద్దామనుకున్న సమయానికే పోలీసులు రంగ ప్రవేశం చేశారని పురుషోత్తం, పద్మజలు వెల్లడించినట్లు సమాచారం.


వివరాల్లోకి వెళితే..

మూఢనమ్మకాలు, ఆపై పరాకాష్టకు చేరిన పరమభక్తికి పెళ్లీడుకొచ్చిన ఇద్దరు బిడ్డలను బలిచ్చింది ఆ తల్లి. ఇది తండ్రి ముందే జరిగిన ఘోరం. మూడురోజులుగా ఇంటిలో పూజలు చేస్తూ, దానిలో భాగంగా ఇద్దరు పిల్లలను పూజలకు బలిచేసిన ఉదంతమిది. చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణం శివాలయంవీధికి చెందిన మల్లూరు పురుషోత్తం నాయుడు, పద్మజ భార్యాభర్తలు. వీరికి అలేఖ్య(27), సాయిదివ్య(23) అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్దకుమార్తె అలేఖ్య మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌లో ఉద్యోగం చేస్తూ, ఇటీవలే రాజీనామా చేశారు. కరోనా నేపథ్యంలో ఇంటివద్దే ఉంటూ సివిల్స్‌కు సిద్ధమవుతున్నారు. రెండో అమ్మాయి సాయిదివ్య ఎంబీఏ పూర్తిచేసి చెన్నైలోని ఏఆర్‌ ఇనిస్టిట్యూట్‌లో మ్యూజిక్‌ ప్రాక్టీస్ చేస్తున్నారు. 


వారి తండ్రి పురుషోత్తంనాయుడు స్థానిక ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాల వైస్‌ ప్రిన్సిపల్‌. తల్లి పద్మజ గణితంలో గోల్డ్‌మెడలిస్టు. మదనపల్లెలోనే ఓ ప్రముఖ పాఠశాలను నిర్వహిస్తున్నారు. కరోనా నేపథ్యంలో ఏడాది కాలంగా ఇద్దరు కుమార్తెలతో కలిసి ఇంట్లోనే ఉంటున్నారు. సాయిబాబా, శివుడు వీరి కుటుంబ ఆరాధ్య దైవాలు. కరోనా వల్ల ఎక్కువ సమయం ఇంట్లోనే గడపాల్సి రావడంతో పూజలు పెంచేశారు. ఈ క్రమంలో మూడురోజులుగా బయటి వ్యక్తులను పిలిపించి ఎడతెరపి లేకుండా పూజలు చేస్తున్నారు. ఇందులోభాగంగా ఆదివారం తల్లితోసహా ఇద్దరు పిల్లలు నగ్నంగా పూజలు చేశారు. ఈక్రమంలో పూజగదిలోనే పెద్దకుమార్తె అలేఖ్యను పద్మజ.. డంబెల్‌తో నుదిటిపై మోదీ చంపేశారు. చనిపోయిన అలేఖ్యను పూజా క్రతువులో భాగంగా బతికించుకొనేందుకు రెండోకుమార్తె సాయిదివ్యను పైఅంతస్తులోని బెడ్‌రూమ్‌లో ఇదే తరహాలో భర్త ఎదుటే పద్మజ చంపేసింది. చంపే ముందే.. ఇద్దరు బిడ్డలను ఇంటిచుట్టూ తిప్పినట్లు స్థానికులు చెబుతున్నారు. 


పెద్దకుమార్తెను చంపే క్రమంలో రెండో కుమార్తె తనను రక్షించాలంటూ బయటకు వచ్చి అరిచినట్లు చెబుతున్నారు. ఆ సమయంలో ఎవరూ ముందుకు రాకపోవడంతో తిరిగి ఇంట్లోకి వెళ్లిపోయింది. ఆ తరువాత కొద్దిసేపటికే తల్లి చేతుల్లోనే హత్యకు గురయ్యింది. తండ్రి పురుషోత్తంనాయుడు.. సాయంత్రం తన మిత్రుడికి ఫోన్‌చేసి జరిగిన విషయమంతా చెప్పాడు.  అలా ఈ ఘోరం బయటపడింది. విషయం తెలుసుకొని డీఎస్పీ రవిమనోహరాచారి, సీఐ, ఎస్‌ఐలు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.ఇంట్లో పూజలు జరిగిన జాడలు గుర్తించారు. నదిటిపై కుంకుమ, విబూది బొట్లు, నోటిలో రాగిచెంబు, శూలం చెక్కబడి ఉన్న స్థితిలో అర్ధనగ్నంగా పడి ఉన్న రెండు మృతదేహాలు వారి కంట పడ్డాయి. ఘటనపై తల్లిదండ్రులను పోలీసులు విచారించారు. ‘‘మా ఇంట్లో దివ్య శక్తులు ఉన్నాయి. మా పిల్లలు మళ్లీ బతికి వస్తారు’’ అని తల్లిదండ్రులు పోలీసులతో అన్నట్టు సమాచారం. పదిరోజులుగా రాత్రంతా ఇంట్లో కేకలు వినిపిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. 

Updated Date - 2021-01-25T16:09:10+05:30 IST