Chittoor: ప్రాథమిక పాఠశాలలో కీచక టీచర్
ABN , First Publish Date - 2022-04-30T18:39:57+05:30 IST
జిల్లాలోని బంగారుపాలెం మండలం చిల్లగుండ్లపల్లి ప్రాథమిక పాఠశాలలో కీచక టీచర్ ఉదంతం వెలుగులోకి వచ్చింది.
చిత్తూరు: జిల్లాలోని బంగారుపాలెం మండలం చిల్లగుండ్లపల్లి ప్రాథమిక పాఠశాలలో కీచక టీచర్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఆరు నెలలుగా చిన్నారులపై టీచర్ అబు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఇంట్లో చెబితే చంపేస్తామంటూ బెదిరింపులకు గురిచేశాడు. హెచ్ఎం చొరవతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. సెల్ ఫోన్లో నీలి చిత్రాలు చూడమని చిన్నారులను టీచర్ అబు ఒత్తిడి చేశాడు. విద్యార్థులు మరుగుదొడ్లకు వెళితే అతను లోపలికి వెళ్లి గడియపెట్టి లైంగిక వేధింపులకు పాల్పడేవాడు. విషయం బయటకు చెబితే చంపేస్తామని పిల్లలను బెదిరిస్తూ అరాచకంగా ప్రవర్తించాడు. దీంతో ఈ విషయాన్ని పిల్లలు దాచి పెడుతూ రాగా... చివరకు ఉపాధ్యాయుడి వికృత చేష్టలను గమనించిన పాఠశాల హెచ్ఎంతో దారుణం వెలుగుచూసింది. దీంతో అసలు విషయం తల్లిదండ్రుల వరకు చేరింది. ఆగ్రహంతో పాఠశాల వద్దకు చేరిన తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. జరిగిన సంఘటనపై తల్లిదండ్రులతో కలిసి జిల్లా విద్యాశాఖ అధికారులు చర్చించారు. కాగా... అసలు విషయం తెలుసుకున్న అబు పాఠశాలకు గైర్హాజరయ్యాడు. చివరకు ఉపాధ్యాయునిపై విద్యాశాఖ సస్పెండ్ వేటు వేసింది.