ప్రభుత్వ ఆసుపత్రుల్లో సీఐడీ తనిఖీలు
ABN , First Publish Date - 2021-04-15T05:28:20+05:30 IST
పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం విశాఖపట్నం సీఐడీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. సీఐడీ ఎస్ఐ గణేష్ అధ్వర్యంలో బయోమెడికల్ పరికరాల కొనుగోలు, నిర్వహణకు సం బంధించి రికార్డులు పరిశీలించారు.
సాలూరు,ఏప్రిల్ 14: పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం విశాఖపట్నం సీఐడీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. సీఐడీ ఎస్ఐ గణేష్ అధ్వర్యంలో బయోమెడికల్ పరికరాల కొనుగోలు, నిర్వహణకు సం బంధించి రికార్డులు పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 2015-18 మధ్య కాలంలో వివిధ పరికరాలు కొనుగోలు చేయగా, అందులో కొన్ని పూర్తిగా పాడైపోయాయని తెలిపారు. ఇంకొన్నింటికి మరమ్మతులు చేస్తే వినియోగంలోకి వస్తాయన్నారు. మరమ్మతులు చేసిన వాటికి బిల్లులు ఉన్నాయా..? లేవా ..? అనే విషయాన్ని సిబ్బందితో మాట్లాడుతున్నామని స్పష్టం చేశారు. ఏ విధంగా పరికరాలను ఉపయోగిస్తున్నారో, వాటిపై ఏ మేరకు శ్రద్ధ తీసుకోన్నారో అనే విషయం కూడా ఆరా తీస్తున్నామని తెలి పారు. మూడు బృందాలుగా నియోజకవర్గంలో ఉన్న ఆసుపత్రుల్లో తనిఖీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. పూర్తి సమాచారాన్ని విశాఖపట్నం ఏసీపీ సునీల్కుమార్కు అందజేస్తామన్నారు. సీఐడీ ఎస్ఐలు శ్రీనివాసరావు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
తెట్టంగి పీహెచ్సీలో ...
గుర్ల: తెట్టంగి పీహెచ్సీని సీఐడీ అధికారులు ఆకస్మికంగా సందర్శించారు. ముందుగా రికార్డులు, పరికరాలను పరిశీలించారు. గతంలో కొనుగోలు చేసిన పరికరాలు, తదితర వాటిపై ఆరా తీశారు. పీహెచ్సీలో ఉన్న వస్తువులు, రోగుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. సరిగ్గా వైద్యం అందించకపోయినా, అధికారులు పనితీరు సరిగా లేకపోయినా తమకు తెలి యజేయాలని రోగులకు సూచించారు. సీఐడీ సీఐ రమణ, ఎస్ఐ రామకృష్ణ, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.
చీపురుపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో..
చీపురుపల్లి: చీపురుపల్లి ప్రభుత్వ ఆసుపత్రిని సీఐడీ అధికారులు బుధవారం తనిఖీ చేశారు. సీఐడీ ఎస్ఐ డి. రవికుమార్, హెచ్సీ శ్రీనివాస రావులు స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఇప్పటి వరకూ ఆసుపత్రిలో ఉన్న మందులు, ఇతర మెటీరియల్ నిల్వలు, ఇటీవల ఆసు పత్రికి వచ్చిన స్టాకు వివరాలను తెలుసుకున్నారు. ఆసుపత్రిలో అందుతున్న సేవలపై ఆరా తీశారు. సూపరింటెండెంట్ డా. ఎం.ప్రసాద్ సీఐడీ అధికారులకు పూర్తి వివరాలు అందజేశారు.