Ap News: పోలీసులమని చెప్పి..16 కేజీల వెండితో పరార్
ABN , First Publish Date - 2022-07-22T12:42:24+05:30 IST
రాజమండ్రిలో వెండిని కొనుగోలు చేసి భీమవరం వస్తున్న తండ్రీ కొడుకులను ఇరువురు వ్యక్తులు అడ్డుకుని తాము పోలీసులమని చెప్పి
పశ్చిమ గోదావరి: రాజమండ్రిలో వెండిని కొనుగోలు చేసి భీమవరం వస్తున్న తండ్రీ కొడుకులను ఇరువురు వ్యక్తులు అడ్డుకుని తాము పోలీసులమని చెప్పి 16 కేజీల వెండిని కాజేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించి ఉండి ఎస్ఐ గంగాధరరావు గురువారం అందించిన వివరాలు ఇలా వున్నాయి. భీమవరానికి చెందిన వెండి వస్తువులను తయారు చేసే వ్యాపారులైన తండ్రీ, కొడుకులు రామలింగేశ్వరరావు, యశ్వంత్లు ఈనెల 16న రాజమండ్రి వెళ్లి 16 కేజీల వెండిని కొనుగోలు చేసుకుని మోటార్సైకిల్పై వస్తున్నారు. ఉండి మండలం సాగపాడు వచ్చేసరికి ఇరువురు వ్యక్తులు తాము తాడేపల్లిగుడెం పోలీసులమని చెప్పి వారి వద్ద వున్న వెండికి, కొనుగోలు చేసిన వస్తువులకు రసీదులు సరిగా లేవంటూ భయపెట్టారు. వారి నుంచి వెండి స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషనకు రమ్మని చెప్పి ముందుగా వెళ్తూ మార్గ మధ్యంలో కనిపించకుండా పోయారు. తండ్రీ కొడుకులు పోలీస్స్టేషన్కు వెళ్లి వారి కోసం నిరీక్షించి పోలీసులకు విషయం వివరించారు. దాంతో ఉలిక్కిపడిన పోలీసులు ఇక్కడ నుంచి తమ వారు ఎవరు రాలేదని వాళ్లెవరో మిమ్మల్ని మోసం చేశారని వివరించారు. దీంతో వారు ఉండి పోలీసు స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.