భారత్-ఒమన్ మధ్య విమాన సర్వీసులపై క్లారిటీ
ABN , First Publish Date - 2021-06-17T17:39:41+05:30 IST
భారత్-ఒమన్ మధ్య విమాన సర్వీసులపై తాజాగా సివిల్ ఏవియేషన్ అథారిటీ(సీఏఏ) క్లారిటీ ఇచ్చింది. కరోనాపై పోరులో భాగంగా ఏర్పాటైన సుప్రీం కమిటీ నిర్ణయాలకు అనుగుణంగా భారత్-ఒమన్ మధ్య విమాన సర్వీసులు నడుస్తాయని సీఏఏ స్పష్టం చేసింది.
మస్కట్: భారత్-ఒమన్ మధ్య విమాన సర్వీసులపై తాజాగా సివిల్ ఏవియేషన్ అథారిటీ(సీఏఏ) క్లారిటీ ఇచ్చింది. కరోనాపై పోరులో భాగంగా ఏర్పాటైన సుప్రీం కమిటీ నిర్ణయాలకు అనుగుణంగా భారత్-ఒమన్ మధ్య విమాన సర్వీసులు నడుస్తాయని సీఏఏ స్పష్టం చేసింది. స్వదేశానికి తిరిగి వెళ్లాలనుకుంటున్న భారతీయుల కోసం ప్రత్యేకంగా విమానాలు నడపనున్నట్లు ప్రకటించింది. అలాగే ఈ విమానాలనే వైద్య పరికరాలు, ఔషధాల తరలింపుకు కూడా వినియోగించనున్నట్లు తెలిపింది. అంతేగాక భారత్ నుంచి ఒమన్ పౌరులు, దౌత్యవేత్తలు, హెల్త్కేర్ వర్కర్లను కూడా వీటిలో తీసుకువస్తామని సీఏఏ పేర్కొంది. ఇక జూన్ 7 నుంచి 13 వరకు భారత్, ఒమన్ మధ్య నడిచిన ప్రత్యేక విమాన సర్వీసులు, ప్రయాణికుల వివరాలు ఇలా ఉన్నాయి..
1. ఒమన్ ఎయిర్: మొత్తం 14 విమానాలు నడిపింది. వీటిలో 58 ప్రయాణికులు రాగా, 14 మంది దేశ పౌరులు, 44 మంది విదేశీయులు ఉన్నారు. ఒక్కో విమానంలో ప్రయాణించిన వారి సంఖ్య 5 కంటే తక్కువ. అలాగే ఈ ప్రయాణికులందరూ కూడా మినహాయింపు కేటగిరీలకు చెందినవారు.
2. సలామ్ ఎయిర్: ఒకే ఒక విమానం నడిపింది. ఇందులో ఇద్దరు ప్రయాణికులు మాత్రమే వచ్చారు.
3. ఎయిర్ ఇండియా: ఎనిమిది విమాన సర్వీసులు నడపగా, వీటిలో 34 మంది ప్రయాణికులు వచ్చారు. వీరిలో ఒకరు ఒమన్ పౌరుడు, మిగతా 33మంది విదేశీయులే. ఇక ఒక్కో విమానంలో ప్రయాణించిన వారి సంఖ్య 5 కంటే తక్కువ. అలాగే ఈ ప్రయాణికులందరూ కూడా మినహాయింపు కేటగిరీలకు చెందినవారు.
4. ఎయిరిండియా ఎక్స్ప్రెస్: మొత్తం 11 విమానాలు నడిపింది. వీటిలో 47 ప్రయాణికులు రాగా, ఇద్దరు దేశ పౌరులు, 45 మంది విదేశీయులు ఉన్నారు. ఒక్కో విమానంలో ప్రయాణించిన వారి సంఖ్య 5 కంటే తక్కువేనని సీఏఏ తెలిపింది.