లాటరీ సరే..జాబితా ఏదీ?
ABN , First Publish Date - 2021-07-27T04:50:24+05:30 IST
ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశాలపై స్పష్టత రావడం లేదు. ఎంపికైన విద్యార్థుల వివరాలను అధికారులు ప్రకటించలేదు. ఆరో తరగతిలో ప్రవేశాలకు సంబంధించి లాటరీ తీసి రోజులు గడుస్తున్నా ఎంపికైన వారి వివరాలు వెల్లడించలేదు. దీంతో తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. అదే సమయంలో లాటరీ ప్రక్రియ అనుమానాలకు తావిస్తోంది.
ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశాలపై రాని స్పష్టత
ఆందోళనలో విద్యార్థులు, తల్లిదండ్రులు
(భోగాపురం)
ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశాలపై స్పష్టత రావడం లేదు. ఎంపికైన విద్యార్థుల వివరాలను అధికారులు ప్రకటించలేదు. ఆరో తరగతిలో ప్రవేశాలకు సంబంధించి లాటరీ తీసి రోజులు గడుస్తున్నా ఎంపికైన వారి వివరాలు వెల్లడించలేదు. దీంతో తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. అదే సమయంలో లాటరీ ప్రక్రియ అనుమానాలకు తావిస్తోంది. కొన్నేళ్లుగా ఆదర్శ పాఠశాలల్లో అడ్మిషన్లకు గిరాకీ ఏర్పడింది. ఆరో తరగతి వరకూ ఇంటర్ వరకూ ఇంగ్లీష్ మీడియం బోధన, తొమ్మిది నుంచి ఇంటర్ వరకూ బాలికలకు హాస్టల్ సౌకర్యం కల్పించడంతో తల్లిదండ్రులతో పాటు విద్యార్థులు ఆదర్శ పాఠశాలల వైపు మొగ్గు చూపుతున్నారు. ఆరో తరగతిలో ప్రవేశిస్తే చాలు.. ఇంటర్ వరకూ ఒకే దగ్గర చదివే అవకాశం ఆసక్తికి మరో కారణం. అయితే గత ఏడాది నుంచి ఆరో తగతిలో ప్రవేశానికి లాటరీ వేస్తున్నారు. జిల్లా కమిటీతో పాటు పాఠశాల కమిటీల సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 19 నుంచి 23 వరకూ లాటరీ ప్రక్రియ కొనసాగింది. కానీ ఎంపికైన వారి వివరాలను మాత్రం వెల్లడించలేదు. జాబితా కోసం తల్లిదండ్రులు ఆశగా ఎదురుచూస్తున్నారు. సంబంధిత పాఠశాలలకు వెళ్లి ఆరా తీస్తున్నారు.
ఇదీ పరిస్థితి
జిల్లాలో 16 ఏపీ ఆదర్శ పాఠశాలలు ఉన్నాయి. ఒక్కో పాఠశాలలో ఆరో తరగతికి సంబంధించి 80 వంతున సీట్లు ఉన్నాయి. మొత్తం 1,280 సీట్లకుగాను గత ఏడాది నుంచి లాటరీ వేసి ఎంపిక చేస్తున్నారు. ఈ ఏడాది 3,259 మంది విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. అన్ని పాఠశాలలకు సంబంధించి జిల్లా కేంద్రంలోని ఆర్సీఎం స్కూల్లో జిల్లా కమిటీ, పాఠశాల కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో లాటరీ వేశారు. 19 నుంచి 23 వరకూ ఐదు రోజుల పాటు ప్రక్రియ సాగింది. ఎంపికైన వారి పేర్లు జాబితా మాత్రం వెల్లడించలేదు. మా పిల్లలు ఎంపికయ్యారా లేదా అంటూ తల్లిదండ్రులు ప్రతిరోజూ సంబంధిత పాఠశాలలను సంప్రదిస్తున్నారు. లాటరీ తీసి రోజులు గడుస్తున్నా జాబితా ప్రచురించకపోవడంపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి తల్లిదండ్రుల సమక్షంలో లాటరీ తీయ్యాలి. కానీ ఎక్కువ మంది తల్లిదండ్రులు హాజరుకాలేదు. కొవిడ్ నిబంధనల నేపథ్యంలో అనుమతివ్వలేదు. కేవలం అధికారుల సమక్షంలోనే లాటరీ పూర్తిచేశారు. వెనువెంటనే జాబితా ప్రకటించి ఉంటే ఏ సమస్యా ఉండేది కాదు. రోజులు గడుస్తున్న కొలదీ విద్యార్థులతో పాటు తల్లిదండ్రుల్లో ఒకటే టెన్షన్. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించాలని కోరుతున్నారు.
త్వరలో జాబితా
లాటరీ ప్రక్రియ పూర్తిచేశాం. త్వరలో ఎంపికైన విద్యార్థుల జాబితాను ప్రకటిస్తాం. ఇందుకు సంబంధించి సన్నాహాలు చేస్తున్నాం. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే జాబితాను ప్రచురిస్తాం.
-నాగమణి, డీఈవో, విజయనగరం