ప్రత్యేక నిబంధనలతో ప్రార్థనా స్థలాల్లో మైకులు: యోగి

ABN , First Publish Date - 2022-04-19T19:39:20+05:30 IST

మత పరమైన విధానాలకు అనుగుణంగా ఆరాధనా పద్ధతులను అనుసరించే స్వేచ్ఛ..

ప్రత్యేక నిబంధనలతో ప్రార్థనా స్థలాల్లో మైకులు: యోగి

లక్నో: మత పరమైన విధానాలకు అనుగుణంగా ఆరాధనా పద్ధతులను అనుసరించే స్వేచ్ఛ ప్రతి ఒక్కరికీ ఉంటుందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. నిర్ధారించిన ప్రాంతాల్లో మాత్రమే మతపరమైన కార్యక్రమాలు, ఆరాధనలు జరుపుకోవాలని, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించరాదని అన్నారు. ప్రార్థనా స్థలాల్లో లౌడ్‌స్పీకర్ల వినియోగంపై వివాదం రేగుతున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ, ప్రార్థనా స్థలాల్లో మైకులు వాడవచ్చని, అయితే మైకుల శబ్దం మాత్రం ఆ ఆవరణ దాటి బయటకు పోరాదని అన్నారు. ఇతరులకు ఎలాంటి సమస్య ఉండకూడదని చెప్పారు. మైక్‌ల ఏర్పాటుకు కొత్తగా పర్మిషన్లు ఇవ్వడం లేదన్నారు.


రాబోయే పండుగల్లో శాంతికి భంగం కలుగకుండా ఉండేలా రాబోయే 24 గంటల్లో మతపరమైన నాయకులు, ప్రముఖులతో సంప్రదింపులు జరపాలని పోలీసు ఉన్నతాధికారులను యోగి ఆదేశించారు. ''అనుమతి లేకుండా ఎలాంటి ఊరేగింపులు తీయరాదు. శాంతి, సామరస్యాలను కాపాడతామంటూ ఆర్గనైజర్ల నుంచి అఫిడవిట్ తీసుకోవాలి. సంప్రదాయబద్ధంగా జరిగే మతపరమైన ఊరేగింపులకే అనుమతి ఇవ్వాలి. కొత్త ప్రోగ్రాంలకు అనుమతి ఇవ్వాల్సిన పనిలేదు'' అని అధికారులను యోగి ఆదేశించారు. యూపీలోని ప్రతి పౌరుడి భద్రత ప్రభుత్వానిది, ప్రజలు సైతం ఇది తమ బాధ్యతగా గుర్తించాలని సూచించారు. వాతావరణాన్ని కలుషితం చేసేందుకు ప్రయత్నించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, నాగరిక సమాజంలో అలాంటి వారికి చోటులేదని యోగి హెచ్చరించారు.

Updated Date - 2022-04-19T19:39:20+05:30 IST