విశ్వవిద్యాలయాల కులపతిగా సీఎం? గవర్నర్ను తప్పించేలా చట్ట సవరణ!
ABN , First Publish Date - 2022-06-27T16:56:33+05:30 IST
యూనివర్సిటీల చట్ట సవరణకు సంబంధించి ముసాయిదా బిల్లు సిద్ధమైంది! విశ్వవిద్యాలయాల్లోని ఖాళీల భర్తీలో కొత్త విధానాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ప్రస్తుత చట్టం ప్రకారం ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు చేయడం.
వర్సిటీల చట్ట సవరణ ముసాయిదా సిద్ధం!
సీఎం కేసీఆర్కు పంపిన అధికారులు
విశ్వవిద్యాలయాల కులపతిగా సీఎం?
గవర్నర్ను తప్పించేలా చట్ట సవరణ!
రాష్ట్ర ప్రభుత్వ యోచన
కామన్ బోర్డు పని ప్రారంభించాలన్నా చట్ట సవరణ జరగాల్సిందే!
శాసనసభ ప్రత్యేక సమావేశాలతో సవరణ?
హైదరాబాద్, జూన్ 26 (ఆంధ్రజ్యోతి): యూనివర్సిటీల చట్ట సవరణకు సంబంధించి ముసాయిదా బిల్లు సిద్ధమైంది! విశ్వవిద్యాలయాల్లోని ఖాళీల భర్తీలో కొత్త విధానాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ప్రస్తుత చట్టం ప్రకారం ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు చేయడం సాధ్యం కాదు. ఈ క్రమంలో యూనివర్సిటీల చట్టానికి సవరణ చేయాల్సి ఉంది. చట్ట సవరణకు సంబంధించిన ముసాయిదాను రూపొందించిన అధికారులు సీఎం కేసీఆర్ ఆమోదం కోసం పంపినట్లు తెలిసింది. వర్సిటీల్లోని ఖాళీల భర్తీలో కొత్త విధానాన్ని అమలు చేయాలని సర్కారు నిర్ణయించింది. ఇందుకోసం కామన్ ఎంట్రెన్స్ను నిర్వహించాలని నిర్ణయించి, కామన్బోర్డును కూడా ఏర్పాటు చేసింది. అయితే ప్రస్తుతం ఉన్న చట్టం ప్రకారం ఈ నిర్ణయాన్ని అమలు చేయడం అసాధ్యం. ఎందుకంటే ఏ వర్సిటీ పరిధిలోని ఖాళీలను ఆ వర్సిటీయే సెలక్షన్ కమిటీ ద్వారా భర్తీ చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కామన్ ఎంట్రెన్స్ ద్వారా అన్ని యూనివర్సిటీల్లోని ఖాళీలను భర్తీ చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయాలంటే.. చట్టానికి సవరణ చేయాల్సి ఉంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని చట్ట సవరణ ముసాయిదాను సిద్ధం చేయగా.. దాన్ని ఇప్పటికే న్యాయ శాఖ అధికారులు పరిశీలించినట్లు సమాచారం. తాజాగా సీఎం ఆమోదం కోసం పంపినట్లు తెలిసింది.
ఆర్డినెన్సా..? అసెంబ్లీ సమావేశాలా?
ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరగడం లేదు. ఇలాంటి సందర్భాల్లో ఆర్డినెన్స్ ద్వారా చట్ట సవరణలను తీసుకొస్తారు. ఇలా చేయాలంటే ముసాయిదా బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ప్రస్తుతం నెలకొన్న రాజకీయ వాతావరణంలో ఈ చట్ట సవరణ ఆర్డినెన్స్కు గవర్నర్ తమిళిసై ఆమోదం తెలుపుతారా? అన్న విషయం ఆసక్తికరంగా మారింది. ఒకవేళ గవర్నర్ వద్దకు బిల్లు పంపొద్దని ప్రభుత్వం భావిస్తే శాసన సభను ప్రత్యేకంగా సమావేశపరచాల్సి ఉంటుంది. మరోవైపు యూనివర్సిటీల్లోని ఖాళీల భర్తీ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత విద్యామండలి ఛైర్మన్ నేతృత్వంలో కామన్ బోర్డు ఏర్పాటు చేసింది. ఇందులో సభ్యులుగా విద్యా శాఖలో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారులు ఉంటారు. పోస్టుల భర్తీ కోసం బోర్డు కార్యకలాపాలను ప్రారంభించాలంటే ముందుగా యూనివర్సిటీ చట్టానికి సవరణ చేయాల్సి ఉంటుంది. సవరణ అనంతరం.. పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేయాల్సి ఉంది. ఆ తర్వాత కామన్ బోర్డు ఆధ్వర్యంలో నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉంటుంది.
కులపతిగా సీఎం..?
యూనివర్సిటీలకు కులపతి విషయంలో కూడా చట్ట సవరణ చేయాలనే ఉద్దేశంలో ప్రభుత్వం ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుత చట్టం ప్రకారం యూనివర్సిటీలకు కులపతిగా గవర్నర్ ఉంటారు. అయితే ఇటీవలి కాలంలో గవర్నర్- రాష్ట్ర ప్రభుత్వం మధ్య కొన్ని అంశాల్లో విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని యూనివర్సిటీలకు కులపతిగా ముఖ్యమంత్రి ఉండేలా చట్టాన్ని సవరించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. పశ్చిమ బెంగాల్లో ఇప్పటికే ఇలాంటి చట్ట సవరణను తీసుకొచ్చారు. అదే మాదిరిగా తెలంగాణలోనూ యూనివర్సిటీల చట్టాన్ని సవరించడానికి ప్రయత్నం జరుగుతున్నట్లు తెలుస్తోంది.