లంచాల గురించి ప్రశ్నించిన సీఎంకు షాకింగ్ ఆన్సర్

ABN , First Publish Date - 2021-11-16T23:41:42+05:30 IST

అనంతరం ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ మాట్లాడుతూ ఉపాధ్యాయుల కోసం తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల గురించి చెబుతూ వచ్చారు. ఈ తరుణంలోనే ‘‘ఉద్యోగాల బదిలీలో డబ్బులు ఇవ్వాల్సి వస్తుందా?’’ అని ప్రశ్నించారు. సీఎం ఈ ప్రశ్న అడిగిన వెంటనే..

లంచాల గురించి ప్రశ్నించిన సీఎంకు షాకింగ్ ఆన్సర్

జైపూర్: ఉపాధ్యాయులతో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రికి చుక్కెదురైంది. బదిలీల్లో లంచాలు ఏమైనా అడుగుతున్నారా అని ప్రశ్నించిన సీఎంకు ఉపాధ్యాయులంతా కలిసి ‘అవును’ అని ముక్తకంఠంతో సమాధానం చెప్పేసరికి షాక్ అవ్వడం సీఎం వంతైంది. రాజస్తాన్‌ రాజధాని జైపూర్‌లో మంగళవారం ‘రాష్ట్ర స్థాయి ఉపాధ్యాయ పురస్కార ప్రధానోత్సవం’ అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. విద్య, పాఠశాల స్థాయిలో అద్భుతంగా పనిచేసిన 111 మంది ఉపాధ్యాయులను సత్కరించారు.


అనంతరం ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ మాట్లాడుతూ ఉపాధ్యాయుల కోసం తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల గురించి చెబుతూ వచ్చారు. ఈ తరుణంలోనే ‘‘ఉద్యోగాల బదిలీలో డబ్బులు ఇవ్వాల్సి వస్తుందా?’’ అని ప్రశ్నించారు. సీఎం ఈ ప్రశ్న అడిగిన వెంటనే అక్కడున్న ఉపాధ్యాయులు ఒక్కసారిగా ‘‘అవును.. ఇవ్వాల్సి వస్తోంది’’ అంటూ సమాధానం చెప్పారు. ఊహించని సమాధానం ఉపాధ్యాయుల నుంచి రావడంతో కాసేపు సీఎం నోట మాట రాలేదు. వెంటనే తేరుకుని మరోసారి బదిలీలు, లంచాల ప్రస్తావన తీయకుండా తన ప్రసంగాన్ని కొనసాగించారు.

Updated Date - 2021-11-16T23:41:42+05:30 IST