Cmకు ఢిల్లీ నుంచి పిలుపు

ABN , First Publish Date - 2022-06-23T16:44:13+05:30 IST

రెండు రోజుల రాష్ట్ర పర్యటన ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్రమోదీ వెనుతిరిగిన వెంటనే ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మైకు ఢిల్లీ నేతల

Cmకు ఢిల్లీ నుంచి పిలుపు

                                          - రెండు రోజులు అక్కడే మకాం 


బెంగళూరు, జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి): రెండు రోజుల రాష్ట్ర పర్యటన ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్రమోదీ వెనుతిరిగిన వెంటనే ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మైకు ఢిల్లీ నేతల నుంచి పిలుపు వచ్చింది. గురువారం ఢిల్లీలో అందుబాటులో ఉండాలని సూచించారు. ఓ వైపు మహారాష్ట్ర రాజకీయాల్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా బిజీగా ఉన్న సమయంలోనే సీఎం బొమ్మైను ఢిల్లీకి పిలవడం చర్చనీయాంశంగా మారింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇదే సందర్భంలో రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ అంశం ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తోంది. ప్రధాని సూచన మేరకే సీఎం బొమ్మైను ఢిల్లీకి రావాల్సిందిగా సూచించారు. గత ఏడాది డిసెంబరు నుంచి రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ అంశం పెండింగ్‌లో ఉంది. పలుమార్లు అగ్రనేతలు రాష్ట్ర పర్యటనల్లో చర్చకు రావడమే కాక స్వయంగా సీఎం ఢిల్లీ వెళ్లి అక్కడా సంప్రదింపులు జరిపారు. రాష్ట్ర శాసనసభకు మరో పది నెలల్లో ఎన్నికలు ఉన్నందున విస్తరణ మరింతజాప్యం చేయరాదనే ఢిల్లీ నేతలు నిర్ణయించినట్టు సమాచారం. రాష్ట్రంలో రెండురోజుల ప్రధాని పర్యటనతో పార్టీవర్గాల్లో ఉత్సాహం నెలకొంది. ఇదే సందర్భంలోనే విస్తరణ తంతు ముగించాలని భావిస్తున్నారు. ప్రధానమంత్రి సూచనతో సీఎంకు పిలుపు వచ్చిన అంశం పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ అరుణ్‌సింగ్‌, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు నళిన్‌కుమార్‌ కటీల్‌కు కూడా తెలియదని పార్టీ వర్గాలు తెలిపాయి. రెండురోజులపాటు ఢిల్లీలో గడిపే సీఎం, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాను వేర్వేరుగా భేటీ అయ్యాక మరోసారి అందరూ కలసి పాల్గొనే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అధిష్టానం గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తే అతిత్వరలోనే విస్తరణ ఖాయం కానుంది. ఢిల్లీకి సీఎం వెళుతుండడంతో ఆశావహులలో ఉత్సాహం నెలకొంది. 

Updated Date - 2022-06-23T16:44:13+05:30 IST