Delhiలో సీఎం బిజీ బీజీ
ABN , First Publish Date - 2022-06-18T17:15:13+05:30 IST
జీఎస్టీ మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై శుక్రవారం కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్తో
- కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, గజేంద్రసింగ్ షెకావత్తో భేటీ
బెంగళూరు, జూన్ 17 (ఆంధ్రజ్యోతి): జీఎస్టీ మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై శుక్రవారం కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్తో ప్రత్యేకంగా పలు అంశాలపై చర్చించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధాని నరేంద్రమోదీ రాష్ట్ర పర్యటనల నేపథ్యంలో సీఎం ఢిల్లీ పర్యటన కుతూహలం కలిగిస్తోంది. ఓ ప్రైవేట్ చానల్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం ఢిల్లీ వెళ్లినట్టు ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. జీఎస్టీ మంత్రుల సమావేశానికి బొమ్మై అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న సంగతి విదితమే. జీఎస్టీ సమావేశానికి ముందు సీఎం, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్తో సమావేశమయ్యారు. బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆయన నాగాలాండ్ ముఖ్యమంత్రి నైతియోరియోను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనను కర్ణాటక పర్యటనకు ఆహ్వానించారు. జీఎస్టీ మంత్రుల సమావేశం రొటీన్ సమావేశాలలో ఒకటని, సీఎం ఢిల్లీ పర్యటన వెనుక ఆంతర్యం ఏదో ఉందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఢిల్లీలో శుక్రవారం మీడియాతో మాట్లాడిన సీఎం ‘అగ్నిపథ్’ పథకాన్ని ప్రశంసించారు. సైన్యంలో చేరేందుకు వయో పరిమితిని 23 సంవత్సరాలకు పెంచుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమన్నారు. దేశ సైన్యంలో సేవలందించాలనుకునే యువతకు విస్తారమైన అవకాశాలు ల భిస్తాయన్నారు. కాగా అగ్నిపథ్ను వ్యతిరేకిస్తూ యువత కొందరు హింసాకాండకు దిగడం విచారకరమన్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి, కేంద్ర జలవనరులశాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్తో భేటీ అయ్యారు. మేకెదాటు పథకానికి సాధ్యమైనంత త్వరగా అన్ని అనుమతులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాజెక్టు విషయంలో తమిళనాడు అభ్యంతరాల నేపథ్యంలో కేంద్రమంత్రితో సీఎం భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. సమావేశం అనంతరం సీఎం మీడియాతో మాట్లాడుతూ మేకెదాటు పథకానికి అడ్డంకులు తొలగిపోతాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.