CM statement: విద్యాశాఖలో కొత్తశక్తిని నింపుతాం
ABN , First Publish Date - 2022-09-06T17:18:02+05:30 IST
దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించడంతోపాటు ప్రతి పాఠశాలలోనూ మౌలిక సదుపాయాలను కల్పించడం ద్వారా
బెంగళూరు, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించడంతోపాటు ప్రతి పాఠశాలలోనూ మౌలిక సదుపాయాలను కల్పించడం ద్వారా విద్యాశాఖలో కొత్తశక్తిని నింపుతామని ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై(Chief Minister Basavaraj Bommai) పేర్కొన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సోమవారం విధానసౌధ బాంక్వెట్హాల్లో ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఉపాధ్యాయులను ఉద్దేశించి ప్ర సంగిస్తూ ఆధునిక యుగంలో విద్యార్థుల్లో నైపుణ్యంతోపాటు దేశభక్తి పెంపొందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. పదవీ విరమణ పొందే ఉపాధ్యాయుల స్థానంలో అదే సంవత్సరంలోనే భర్తీ చేస్తామన్నారు. త్వరలోనే 15వేల మంది ఉపాధ్యాయుల నియామక ప్రక్రియ అమలు చేస్తామని హామీ ఇచ్చారు. వచ్చే ఏడాది నుంచే రిటైర్మెంట్కు అనుగుణంగా ఉపాధ్యాయుల(Teachers) భర్తీ ఉంటుందని తెలిపారు. నేటి ఆధునిక సాంకేతిక సమాజంలో అందుకు అనుగుణంగా బాల్యం నుంచే తగిన శిక్షణ అవసరమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 23వేల తరగతి గదులను నిర్మిస్తామని, తొలి విడతలో రూ.8వేల కోట్లు కేటాయించామన్నారు. వచ్చే ఏడాది ఆగస్టునాటికి అన్ని పాఠశాలల్లోనూ శౌచాలయాలు, మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. సమాజానికి మార్గదర్శకులు గురువులని ఉపాధ్యాయులు లేని విద్య ఊహించడం సాధ్యం కాదన్నారు. విద్య లేకుంటే మనోవికాసం అసాధ్యమన్నారు. విద్యార్థుల్లో ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించడం ప్రధానంగా భావించాలన్నారు. ప్రాథమిక విద్యాశాఖ మంత్రి బీసీ నాగేశ్, రాష్ట్ర ప్రభుత్వ విద్యాసంస్కరణల సలహాదారులు ప్రొఫెసర్ దొరస్వామి, ఎమ్మెల్సీలు పుట్టణ్ణయ్య, బీఎస్ అరుణ్, శాంతారామ్ సిద్ది, ప్రతా్పసింహ నాయక్ పాల్గొనగా 20 మంది ప్రాథమిక, 11 మంది హైస్కూల్ ఉపాధ్యాయులను సత్కరించారు.