సత్తెనపల్లిలో బోగీ దహనానికి సీఎం కుట్ర

ABN , First Publish Date - 2022-07-06T08:04:54+05:30 IST

సత్తెనపల్లిలో బోగీ దహనానికి సీఎం కుట్ర

సత్తెనపల్లిలో బోగీ దహనానికి సీఎం కుట్ర

రైలు దిగిపోయేలా కిషన్‌రెడ్డిపై ఒత్తిడి

విజయసాయి హింసాప్రవృత్తి చాటుకున్నారు: రఘురామ

అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనేందుకు తాను రైలులో భీమవరం బయల్దేరిన విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి.. ఆ రైలు బోగీని దహనం చేయడానికి కుట్ర పన్నారని రఘురామరాజు ఆరోపించారు. ఈ విషయాన్ని ఒక మీడియా సంస్థ వార్తాకథనం ప్రచురించిందని మంగళవారం ఢిల్లీలో విలేకరులకు తెలిపారు. తనతోపాటు అదే రైలులో మరో బోగీలో ప్రయాణించాల్సిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని రైలు దిగిపోయేలా జగన్‌  ఒత్తిడి తెచ్చినట్లు ఆ కథనంలో ఉందని వెల్లడించారు. రైలు సత్తెనపల్లికి చేరుకోగానే బోగీ తగలబెట్టేందుకు కుట్ర చేశారనేది నిజమని, అందుకే కిషన్‌రెడ్డిని దిగిపొమ్మని జగన్‌ ఒత్తిడి చేసినట్లు తనకు సమాచారం అందిందని తెలిపారు. ఒకవేళ ఆ మీడియా కథనం తప్పయితే, ఆ సంస్థపై చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే.. ఇదొక కట్టుకథ అని చెప్పడం ద్వారా విజయసాయిరెడ్డి తనలోని హింసాప్రవృత్తిని మరోసారి చాటుకున్నారని మండిపడ్డారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎవరి పేరిట ఉందో చెప్పాలన్న రఘురామ.. ఆ పెగ్గురెడ్డి పార్టీలో పెగ్గురాజు ఉన్నారని వ్యాఖ్యానించారు. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డితో కలిసి తాను ఎన్నోసార్లు రెండేసి పెగ్గులు సేవించానని చెప్పారు. మద్యం సేవించడం నేరం కాదని.. హత్యలు చేయడం, కుటుంబ సభ్యులను లేపేయడమే నేరమని విజయసాయిరెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పెగ్గులు అమ్ముకుని జగన్‌ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని అన్నారు. ప్రజలు జగనన్నకు పెట్టిన పేరు ’జలగన్న’ అని ఎద్దేవాచేశారు.

Updated Date - 2022-07-06T08:04:54+05:30 IST