Hyderabad: సీఎం కాన్వాయ్‌కు అడ్డొచ్చిందని మహిళపై..

ABN , First Publish Date - 2022-09-19T16:26:13+05:30 IST

సీఎం వెళ్లే సమయంలో ట్రాఫిక్‌ విధులకు ఆటంకం కలిగించిన మహిళపై ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు...

Hyderabad: సీఎం కాన్వాయ్‌కు అడ్డొచ్చిందని మహిళపై..

హైదరాబాద్/పంజాగుట్ట: సీఎం వెళ్లే సమయంలో ట్రాఫిక్‌ విధులకు ఆటంకం కలిగించిన  మహిళపై ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 17న సీఎం కేసీఆర్‌ ఎన్టీఆర్‌ స్టేడియంలో బహిరంగ సభ అనంతరం సాయంత్రం సమయంలో రాజ్‌ భవన్‌ రహదారిలో కాన్వాయ్‌తో ప్రగతిభవన్‌కు వెళ్లారు. ఆ సమయంలో ట్రాఫిక్‌ పోలీసులు ప్రధాన రహదారిపైకి వచ్చే వాహనాలను నిలిపి వేశారు. రాజ్‌ భవన్‌ రోడ్‌ లక్కీ రెస్టారెంట్‌ వద్ద ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ బి.రాజు విధుల్లో ఉన్నారు. సీఎం కాన్వాయ్‌ వస్తోందని రెస్టారెంట్‌ మార్గంలో మెర్సిడస్‌ బెంజ్‌ కారును ఆపారు. ముందు సీట్లో కూర్చున్న మహిళ కిందికి దిగి ఎందుకు ఆపుతున్నారు, అత్యవసరంగా వెళ్లాలని అతడితో వాగ్వాదానికి దిగారు. ప్రధాన రహదారిపైకి నడుచుకుంటూ వెళ్తుండగా వీవీఐపీ వస్తున్నారు.. వెళ్లొద్దని కానిస్టేబుల్‌ వారించారు.


అక్కడికి చేరుకున్న పంజాగుట్ట పెట్రోలింగ్‌ పోలీసులు ఆమెకు సర్ది చెప్పే ప్రయత్నం చేసినా ఆగలేదు. ఆ మర్నాడు విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లగా, వారి సూచనల మేరకు సదరు మహిళపై పంజాగుట్ట పీఎస్‌లో కానిస్టేబుల్‌ రాజు ఫిర్యాదు చేశాడు. తనను అసభ్య పదజాలంతో దూషించిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ సంఘటన అంతా సెల్‌ఫోన్‌లో రికార్డ్‌ చేశానని తెలిపాడు. అతని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2022-09-19T16:26:13+05:30 IST