CM jagan: కేంద్రమంత్రి ఆర్కేసింగ్తో సీఎం జగన్ భేటీ
ABN , First Publish Date - 2022-08-22T20:54:37+05:30 IST
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీలో బిజీబిజీగా గడుపుతున్నారు. ప్రధాని, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతితో వరుసగా భేటీ అయ్యారు.
న్యూఢిల్లీ/అమరావతి: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (Jagan mohan reddy) ఢిల్లీలో బిజీబిజీగా గడుపుతున్నారు. ప్రధాని, రాష్ట్రపతి భేటీ అనంతరం కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ (RK singh)ను సీఎం కలుసుకున్నారు. సుమారు అరగంట పాటు వీరి భేటీ కొనసాగింది. తెలంగాణ నుంచి రావలసిన ఆరువేల కోట్ల రూపాయలు విద్యుత్ బకాయిలపై చర్చించినట్లు తెలుస్తోంది. అనంతరం కేంద్రమంత్రి (Union minister) మీడియాతో మాట్లాడుతూ... విద్యుత్ రంగానికి సంబంధించిన సమస్యలను జగన్ చర్చించారన్నారు. తెలంగాణ పెద్ద ఎత్తున ఏపీకి బకాయిలు చెల్లించాల్సి ఉందని, తెలంగాణ నుంచి రావలసిన ఆరువేల కోట్ల రూపాయల బకాయిలపై చర్చించినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి లేవనెత్తిన సమస్యలను పరిష్కరిస్తామన్నారు. ప్రస్తుతం ఈ విషయం సొలిసిటర్ జనరల్ వద్ద ఉందని కేంద్రమంత్రి తెలిపారు.
త్వరలోనే దీనిపై తాము ఒక నిర్ణయం తీసుకుంటామని హామీ ఇస్తున్నామన్నారు. చట్టం ప్రకారం ప్రాథమికంగా ఎవరు బకాయిలు చెల్లించాలనే దానిని పరిష్కారం చేస్తామని అన్నారు. పవర్ ఎక్స్చేంజ్లలో కొనుగోళ్ల బకాయిలపై సమాచారంలో పొరపాట్లు లేవని చెప్పారు. బకాయిలు చెల్లించని డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు 75 రోజులలోగా చెల్లించాలని స్పష్టం చేశారు. బకాయిలు చెల్లించకపోతే విద్యుత్ కొనుగోలు చేసే అవకాశాన్ని కోల్పోతారని కేంద్రమంత్రి ఆర్కే సింగ్ హెచ్చరించారు.