వెన్నుదన్నుగా ఉన్న ప్రతి ఒక్కరికీ సెల్యూట్: Jagan

ABN , First Publish Date - 2022-07-08T17:53:52+05:30 IST

వైసీపీకి వెన్నుదన్నుగా ఉన్న ప్రతి ఒక్కరికీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సెల్యూట్ చేశారు.

వెన్నుదన్నుగా ఉన్న ప్రతి ఒక్కరికీ సెల్యూట్: Jagan

గుంటూరు: వైసీపీ(YCP)కి వెన్నుదన్నుగా ఉన్న ప్రతి ఒక్కరికీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (Jagan mohan reddy) సెల్యూట్ చేశారు. వైసీపీ ప్లీనరీ సమావేశాల్లో సీఎం ప్రారంభోపన్యాసం చేశారు. ‘‘ఎక్కడి నుంచి మొదలుపెట్టాం ఎక్కడికి వచ్చాం. 2009 సెప్టెంబర్ 5న పావురాలగుట్టలో ఈ సంఘర్షణ మొదలైంది. ఓదార్పుయాత్రలో ఓ రూపం సంతరించుకొని.. 2011 మార్చిలో ఓ పార్టీగా ఏర్పడింది. 13 ఏళ్ళుగా ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్నాం’’ అంటూ జగన్ అన్నారు. ఈ జగమంత కుటుంబం ఏనాడు తనను వీడలేదన్నారు. మేనిఫెస్టోలను భగవద్గీత, ఖురాన్, బైబిల్గా భావించి పాలన చేస్తున్నామని తెలిపారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే పార్టీ వైసీపీ అని స్పష్టం చేశారు. రాజకీయాల్లో మార్పును తీసుకువచ్చిన పార్టీ వైసీపీ అని అన్నారు. వివక్ష, కరప్షన్ లేకుండా పారదర్శక పాలన అందిస్తున్నామని చెప్పుకొచ్చారు. పరిపాలన సంస్కరణలను చేసి చూపిన పార్టీ వైసీపీ అని పేర్కొన్నారు.


అన్ని రంగాల్లోనూ సంస్కరణలు తీసుకువచ్చామని, ప్రతి పేదవాడి సొంతింటి కలను నెరవేర్చామన్నారు. కరోనా తీవ్రతలోనూ ఆర్థికంగా దెబ్బతినకుండా చూశామని అన్నారు. గత ప్రభుత్వ బకాయిలను కూడా తాము చెల్లించామని తెలిపారు. లంచాలు, అవినీతికి తావులేకుండా పాలన అందిస్తున్నామన్నారు. సంక్షేమ పాలన అందిస్తున్నా కొందరు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. దుష్టచతుష్టయం, దత్తపుత్రుడు కలిసి దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. ఇచ్చిన హామీల్లో 95 శాతం అమలు చేశామని అన్నారు. ‘‘మన గెలుపు ఆపడం ఈ గజదొంగల తరం కాదు’’ అని  సీఎం జగన్‌ స్పష్టం చేశారు. 


Updated Date - 2022-07-08T17:53:52+05:30 IST