సీఎం పర్యటనను విజయవంతం చేయాలి
ABN , First Publish Date - 2022-08-09T06:23:33+05:30 IST
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి బాపట్ల పర్యటనను విజయవంతం చేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగ నాగార్జున కోరారు.
బాపట్ల, ఆగస్టు 8: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి బాపట్ల పర్యటనను విజయవంతం చేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగ నాగార్జున కోరారు. సోమవారం ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను ఎంపీ మోపిదేవి వెంకటరమణ, డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, కలెక్టర్ కె.విజయకృష్ణన్, ఎస్పీ వకుల్ జిందాల్, నాయకులతో కలిసి మంత్రి పరిశీలించారు. ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఏర్పాటు చేస్తున్న వేదికను పరిశీలించి తగుసూచనలు చేశారు. ఎస్పీ కార్యాలయ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న హెలిప్యాడ్ను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈనెల 11వ తేదీన ముఖ్యమంత్రి జగన్ విద్యాదీవెన నాలుగో విడత కార్యక్రమాన్ని ప్రారంభిస్తారన్నారు. డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి మాట్లాడుతూ బాపట్లలో విద్యాదీవెన కార్యక్రమం ఏర్పాటు చేయటం హర్షణీయమన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ పోతుల సునీత, అద్దంకి నియోజకవర్గ ఇన్చార్జి బాచిన కృష్ణచైతన్య, చీరాల నియోజకవర్గ ఇన్చార్జి కరణం వెంకటేష్, ఆర్అండ్బీ ఏఈ శ్రీనివాస్, జిల్లా పంచాయతీ అధికారి రమేష్, ఆర్డీవో గంధం రవీందర్, మున్సిపల్ కమీషనర్ ఎ.భానుప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ముఖ్యమంత్రి పర్యటనపై కలెక్టరేట్లోని స్పందన సమావేశ మందిరంలో కలెక్టర్ కె.విజయకృష్ణన్ అధికారులతో సమీక్షించారు. పర్యటన సజావుగా నిర్వహించటానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.