ఉద్యోగాల కల్పవల్లి కేసీఆర్ సర్కార్

ABN , First Publish Date - 2021-01-05T05:54:14+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం ఆరున్నర సంవత్సరాలుగా మొత్తంగా 21 లక్షల 47 వేల 946 మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించింది. ప్రభుత్వ, ప్రభుత్వేతరరంగాల్లో ఉపాధి కల్పన, ఉద్యోగాల భర్తీలో తెలంగాణ....

ఉద్యోగాల కల్పవల్లి కేసీఆర్ సర్కార్

ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం ఆరున్నర సంవత్సరాలుగా మొత్తంగా 21 లక్షల 47 వేల 946 మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించింది. ప్రభుత్వ, ప్రభుత్వేతరరంగాల్లో ఉపాధి కల్పన, ఉద్యోగాల భర్తీలో తెలంగాణ దేశంలోనే సాటిలేని మేటి రాష్ట్రంగా నిలిచింది. వాస్తవాలు ఇవైతే నిరుద్యోగ యువతకు కేసీఆర్ ఏమీ చేయలేదనడం ఏమి విజ్ఞత?


తెలంగాణ ఉద్యమంలో నియామకాలకు సంబంధించి ఉద్యమనేతగా నినదించిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిగా స్పష్టమైన కార్యాచరణతో ముందుకు సాగుతున్న సంగతి జగద్విదితం. ఉద్యోగాలంటే కేవలం ప్రభుత్వశాఖల్లో నియమించే ఉద్యోగాలే అన్న అపోహ చాలామందికి ఉంటుంది. కానీ, తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ ద్వారా జరిగిన ప్రభుత్వ ఉద్యోగ నియామకాలే కాక, ప్రభుత్వరంగ సంస్థలైన ఆర్టీసీ, సింగరేణితో పాటు, విద్యుత్, పోలీసు, వైద్య ఆరోగ్య శాఖలు, విశ్వవిద్యాలయాలు, వివిధ కార్పొరేషన్లు, సొసైటీల్లో జరిగే నియామకాలు కూడా ఉద్యోగాల కిందకే వస్తాయని అర్థం చేసుకోవాలి. ఆ విధంగా కేవలం ప్రభుత్వశాఖలలోనే కాకుండా నిరుద్యోగులకు పరిశ్రమల్లో, ఐటీ తదితర ప్రభుత్వేతర రంగాల్లో ప్రత్యక్ష లేదా పరోక్ష రీతిలో ఏ విధమైన ఉపాధి కల్పించినా అవి కూడా ఉద్యోగ నియామకాల కిందకే వస్తాయనే విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలా దాదాపు 22 లక్షల మందికి ఉపాధి కల్పించడం జరిగింది.


ఉపాధి కల్పన, ఉద్యోగాల భర్తీ విషయంలో వాస్తవాల కంటే, వక్రీకరణలే ప్రచారంలోకి వస్తున్నందున నిజాలను తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. కేసీఆర్‌ ప్రభుత్వం మున్నెన్నడూ కనీ-వినీ ఎరుగని రీతిలో, కేవలం ఆరున్నర సంవత్సరాల్లోనే ప్రభుత్వ, ప్రభుత్వేతర, ప్రభుత్వరంగ సంస్థల్లో దాదాపు లక్షా ఏభైవేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేసింది. ఇందులో 31,072 ఉద్యోగాలు టీఎస్‌పీఎస్సీ ద్వారా, 9,289 ఉద్యోగాలు విద్యుత్ శాఖలో, 13,625 ఉద్యోగాలు సింగరేణి సంస్థలో, 28,277 పోలీసుశాఖలో, 9,355 పంచాయతీ కార్యదర్శులు, 3,463 ఉద్యోగాలు గురుకుల పాఠశాలల్లో, యూనివర్సిటీలు, కార్పొరేషన్లు, సొసైటీల్లో 9600, వైద్య ఆరోగ్యశాఖలో 1,500 ఉద్యోగ నియామకాలతో సహా మరికొన్ని కూడా ఉన్నాయి. ఇవికాక ఐటీ రంగంలో, తెలంగాణ ప్రభుత్వ చొరవ, సానుకూల విధానాల వల్ల మరో 5 లక్షల 82 వేల మందికి పైగా ఉద్యోగాలు లభించాయి. ఇది కాకుండా తెలంగాణ ప్రభుత్వం టీఎస్‌ఐపాస్ పాలసీ రూపొందించి, రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు అవసరమైన అన్ని సౌకర్యాలు, ప్రోత్సాహకాలు కల్పించడంతో రాష్ట్రంలో దాదాపు 14 వేలకు పైగా పరిశ్రమలు ఏర్పాటయ్యాయి.


ఈ పరిశ్రమల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా 14 లక్షల 59 వేల మందికి పైగా ఉపాధి లభిస్తున్నది. ఇలా మొత్తంగా కలిపి చూస్తే 21 లక్షల 47 వేల మందికి పైగా నిరుద్యోగులకు ప్రభుత్వ, ప్రభుత్వేతరరంగాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించిన తెలంగాణ దేశంలోనే సాటిలేని మేటి రాష్ట్రంగా నిలిచింది. బహుశా భారతదేశంలోనే ఇంత తక్కువకాలంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పన విషయంలో గానీ, ఈపాటికే విధుల్లో వున్న ప్రభుత్వ- ప్రభుత్వరంగ ఉద్యోగుల విషయంలో గానీ కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన తరహాలో మరే రాష్ట్ర ప్రభుత్వమూ లబ్ధి చేకూర్చే చర్యలు చేపట్టలేదు. ఇది ఎంత మాత్రం అతిశయోక్తి కాదు. 


వాస్తవంగా తెలంగాణలో నిరుద్యోగ సమస్య తీర్చేందుకు, ప్రభుత్వ శాఖలలో ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోంది. ఇందుకు ప్రత్యేకంగా రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఏర్పాటు చేసింది. అకడమిక్, పాలనారంగ నిష్ణాతుడైన ఆచార్య ఘంటా చక్రపాణిని ఈ కమిషన్‌కు తొలి ఛైర్మన్‌గానూ, తదుపరి డి కృష్ణారెడ్డిని తాత్కాలిక చైర్మన్‌గా నియమించారు. ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2020 చివరినాటికి 36,665 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. నియామక ప్రక్రియలో భాగంగా 31,072 ఉద్యోగాలను ఇప్పటికే భర్తీ చేసింది. మిగతా పోస్టుల భర్తీ ప్రక్రియ వివిధ దశల్లో ఉంది. అలాగే, రాష్ట్రంలో 3,463 గురుకుల విద్యాలయాల పోస్టులను కూడా భర్తీ చేసింది. రాష్ట్రంలోని 391 కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాల్లో పని చేస్తున్న స్పెషల్ ఆఫీసర్ల జీతాలను రూ.21,000 నుండి రూ.25,000 లకు, సీఆర్టీల వేతనాన్ని రూ.15 వేల నుంచి రూ.20 వేలకు పెంచింది. 840 మంది బోధన, 588 మంది బోధనేతర సిబ్బందిని నియమించడానికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కొత్తగా ఏర్పడిన జిల్లా కేంద్రాలను కలుపుకుని మొత్తం 33 జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసే అర్బన్ రెసిడెన్షియల్ స్కూళ్లలో 377 ఉద్యోగాల నియామకాలకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. 


సింగరేణి బొగ్గు గనుల్లో పని చేస్తున్న కార్మికుల ఆధారిత కుటుంబసభ్యులకు 10,477 డిపెండెంట్ ఉద్యోగాలు, ఎక్స్టర్నల్ రిక్రూటీలు 3,148 వెరసి 13,625 ఉద్యోగాలు కల్పించారు. ఇవేగాక బోనస్‌లు, వార్షిక ఇంక్రిమెంట్లు ప్రకటిస్తూనే ఉన్నారు. ఉద్యోగ భద్రతలో భాగంగా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది. గురుకుల పాఠశాలల్లో తొమ్మిదేళ్లుగా కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న 758 మంది టీచర్లు, అడ్‌హాక్ పద్ధతిలో పని చేస్తున్న 18 మంది టీచర్ల సర్వీసులను క్రమబద్ధీకరించాలని, 2488 మంది భాషాపండిట్లను, 1047 పీఈటీలను స్కూల్ అసిస్టెంట్లుగా అప్‌గ్రేడ్ చేయాలని నిర్ణయించింది. 


తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ఉద్యోగులకు కేసీఆర్‌ ప్రభుత్వం పీఆర్‌సిని ప్రకటించింది. మూలవేతనంలో 43 శాతం మేర పెంచి (ఫిట్‌మెంట్‌) ఇచ్చింది. సకల జనుల సమ్మెలాంటి అద్భుత పోరాటాలు చేసిన ఉద్యోగులకు ప్రత్యేక ఇంక్రిమెంట్ కూడా మంజూరు చేసింది. మరో విడత పీఆర్సీ ప్రకటించడానికి కూడా కసరత్తు జరుగుతున్నది. 


ఇందిరా క్రాంతిపథం (ఐకేపీ) ఉద్యోగులు, సిబ్బందికి ప్రభుత్వం వేతనాలను పెంచింది. సెర్ఫ్‌తో పాటు జాతీయ ఉపాధి హామీ చట్టం కింద పనిచేస్తున్న ఉద్యోగులు, సిబ్బందికి జీతాలు పెరిగాయి. సెర్ఫ్‌లో 4,174 మంది ఉద్యోగులుండగా, వారిలో 767 మందికి రూ.6,260 నుంచి రూ.12,000 మేరకు వేతనాలను పెంచారు. మిగతావారికి 30 శాతం అధికం చేశారు. అలాగే ఉపాధిచట్టంలో పని చేస్తున్న ఫీల్డ్‌ అసిస్టెంట్లకు రూ.6,290 వేతనంగా ఉండగా, దాన్ని రూ.10,000 చేసింది ప్రభుత్వం. మిగతా వారికి 30 శాతం వర్తింపజేశారు. దీంతో మొత్తం 11,415 మందికి జీతాలు పెరిగాయి. ఇందులో 7,402 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు కాగా, 4,013 మంది(30 శాతం) ఎఫ్‌టిఇలు ఉన్నారు.


విద్యుత్ శాఖలోని ట్రాన్స్‌కో, జెన్‌కో, డిస్కమ్‌లలో పనిచేస్తున్న దాదాపు 23,667 మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులందరి సర్వీసులను దశలవారీగా క్రమబద్ధీకరణ చేయడం జరిగింది. వీరికి ఉద్యోగ భద్రతతోపాటు మెరుగైన జీతభత్యాలు లభిస్తున్నాయి. రాష్ట్రంలోని విద్యుత్‌శాఖ ఉద్యోగులందరికీ 27.5 శాతం ఫిట్‌మెంట్‌ అలవెన్స్‌ మంజూరు చేసింది ప్రభుత్వం. విద్యుత్‌శాఖలోని జెన్‌కో, ట్రాన్స్‌కో, డిస్కం ఉద్యోగులకు 30 శాతం ఫిట్‌మెంట్‌తో కూడిన వేతన సవరణ చేస్తూ ప్రభుత్వం 2 డిసెంబర్, 2014న నిర్ణయించింది. 


ఉమ్మడి రాష్ట్రంలో 16 వేల మంది హోంగార్డులకు రూ.9 వేలు మాత్రమే వేతనం ఉండేది. వీరి డిమాండ్లు విన్న సీఎం కేసీఆర్ తొలివిడతలో ఆ మొత్తాన్ని 9 వేల నుంచి 12 వేలకు పెంచారు. మలివిడతలో డిసెంబర్ 2017 నుంచి రూ.20 వేలకు పెంచారు. ప్రతి ఏటా వీరి వేతనాన్ని వెయ్యి రూపాయలు పెంచేలా చర్యలు తీసుకున్నారు. అంతేగాకుండా రాష్ట్రంలోని 30 విభాగాల ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు 100 శాతానికి పెంచారు. 


ఇక ఐటీ రంగంలో ప్రపంచ దేశాలతో పోటీపడుతున్న తెలంగాణ ప్రత్యేకంగా రూపొందించిన ఐటీ పాలసీ మూలంగా గడిచిన ఆరున్నర సంవత్సరాల్లో రూ.1,28,807 కోట్ల ఎగుమతులను సాధించింది. రాష్ట్రంలోని ఐటీ సంస్థలలో 5,82,126 మంది ఉద్యోగాలు పొందారు. 


 వీటన్నింటికీ అదనంగా ప్రతిష్టాత్మకంగా రాష్ట్రంలో అమలవుతున్న టీఎస్ఐపాస్ సింగిల్ విండో పారిశ్రామిక విధానం ద్వారా లైసెన్సులు పొందిన 14,338 పరిశ్రమల్లో దాదాపు 14,59,639 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించారు. ఈ పరిశ్రమల ద్వారా రూ.2,07,595 కోట్ల విలువ చేసే పెట్టుబడులు వచ్చాయి. వీటితో ప్రత్యక్షంగానే కాక, పరోక్షంగా కూడా లక్షలాదిమందికి ఉపాధి దొరికింది. ఇవన్నీ కూడా ఉద్యోగ, ఉపాధి కల్పన కిందకే వస్తాయి కదా! అన్నిరంగాల్లో కలిపి వీటన్నింటినీ లెక్కించి చూస్తే మొత్తంగా 21 లక్షల 47 వేల 946 మంది నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గడచిన ఆరున్నర సంవత్సరాలలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించినట్లయింది. వాస్తవాలు ఇలా ఉంటే, నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం ఏమీ చేయలేదంటూ ఇప్పటికీ కొందరు వక్రీకరించడాన్ని వారి విజ్ఞతకే వదిలేయాల్సి ఉంటుంది.

ఇదిలా ఉండగా, నూతన సంవత్సర కానుకగా రాష్ట్రంలోని అన్నిరకాల ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు పెంచాలని, ఉద్యోగ విరమణ వయసును పెంచాలని, అన్నిశాఖల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ప్రభుత్వ ఉద్యోగులు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఉద్యోగులు, వర్క్ చార్జ్‌డ్ ఉద్యోగులు, దినసరి వేతన ఉద్యోగులు, ఫుల్‌టైమ్ కాంటింజెంట్ ఉద్యోగులు, పార్ట్ టైమ్ కాంటింజెంట్ ఉద్యోగులు, హోంగార్డులు, అంగన్‌వాడీ వర్కర్లు, కాంట్రాక్టు ఉద్యోగులు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు, ఆశ వర్కర్లు, విద్యా వలంటీర్లు, సెర్ఫ్ ఉద్యోగులు, గౌరవవేతనాలు అందుకుంటున్నవారు, పెన్షనర్లు ఇలా అందరికీ ప్రయోజనం కలిగేలా వేతనాలు పెంచుతామని ముఖ్యమంత్రి ప్రకటించారు. అన్నిరకాల ఉద్యోగులు కలిపి తెలంగాణలో 9,36,976 మంది ఉంటారని, అందరికీ వేతనాల పెంపు వర్తిస్తుందని ఆయన వెల్లడించారు. 


-వనం జ్వాలా నరసింహారావు 

Updated Date - 2021-01-05T05:54:14+05:30 IST