సీఎం కేసీఆర్ దేశవ్యాప్త పర్యటన
ABN , First Publish Date - 2022-05-20T08:41:09+05:30 IST
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు జాతీయ స్థాయిలో పలు రాజకీయ, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు దేశవ్యాప్తంగా పర్యటించనున్నారు.
- అందులో భాగంగా నేడు ఢిల్లీకి..
- 22న పంజాబ్కు, 26న బెంగళూరుకు
- పర్యటనలో పలు రాజకీయ పార్టీలు, ప్రముఖ ఆర్థికవేత్తలతో సమావేశాలు
- రైతుల ఉద్యమంలో చనిపోయిన వారికి పరిహారం
- వీర మరణం పొందిన సైనికులకు కూడా
- 27న తిరిగి హైదరాబాద్కు రాక
- 29 లేదా 30న బెంగాల్, బిహార్కు
హైదరాబాద్, మే 19 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు జాతీయ స్థాయిలో పలు రాజకీయ, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు దేశవ్యాప్తంగా పర్యటించనున్నారు. అందులో భాగంగా శుక్రవారం మధ్యాహ్నం ఆయన ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా వివిధ రాజకీయ పార్టీలతో, ప్రముఖ ఆర్థిక వేత్తలతో ఆయన సమావేశం కానున్నారు. దేశ రాజకీయ, ఆర్థిక స్థితిగతులపై వారితో చర్చించనున్నారు. అలాగే జాతీయ మీడియా సంస్థల జర్నలిస్టులతోనూ ఆయన భేటీ కానున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ను కూడా ఆయన కలుస్తారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది. అనంతరం ఢిల్లీ నుంచి 22న మధ్యాహ్నం సీఎం పంజాబ్కు బయల్దేరతారు. కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి, ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాలకు ఈ సందర్భంగా ఆయన ఆర్థిక సహాయం చేయనున్నారు. 600 రైతుల కుటుంబాలను ఆయన పరామర్శించనున్నారు. ఒక్కో కుటుంబానికి రూ.3 లక్షల చొప్పున చెక్కులు అందిస్తారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
26న ఉదయం ఆయన బెంగళూరుకు బయల్దేరతారు. ఈ సందర్భంగా మాజీ ప్రధాని దేవెగౌడ, ఆయన కుమారుడు, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామితో కేసీఆర్ భేటీ అవుతారు. అక్కడి నుంచి 27న మహారాష్ట్రలోని రాలెగావ్సిద్ధికి వెళతారు. అక్కడ ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నాహజారేతో సమావేశమవుతారు. అనంతరం సాయిబాబా దర్శనం కోసం షిరిడీకి వెళ్తారు. అక్కడి నుంచి తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. అనంతరం 29 లేదా 30న బెంగాల్, బిహార్ పర్యటనకు సిద్ధం కానున్నారు. గల్వాన్ లోయలో వీరమరణం పొందిన సైనికుల కుటుంబాలను ఈ సందర్భంగా ఆయన పరామర్శిస్తారు. ఇంతకుముందు ప్రకటించినట్లు వారి కుటుంబాలకు ఆర్థిక సాయం అందిస్తారు.
అప్పులకు అనుమతి కోసం ఢిల్లీకి ఆర్థికశాఖ అధికారులు
కాగా అప్పులకు అనుమతించేది లేదని కేంద్రం స్పష్టం చేయడంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా కుదేలయింది. దాంతో పరిస్థితిని చక్కదిద్దడానికి, కేంద్రం మనఃస్థితి ఏవిధంగా ఉందో తెలుసుకోవడానికి ఢిల్లీకి వెళ్లాలని ఇప్పటికే ఆర్థిక శాఖ అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. దాంతో కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి సోమనాథన్ను కలవడానికి రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును ఢిల్లీకి పంపించారు. సీఎం ఆదేశాలతో గురువారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్న ఆయన... సోమనాథన్ను కలిసే యత్నంలో ఉన్నారు. కాగా ఈ పర్యటనలో కేంద్రం రుణాలకు అనుమతి ఇవ్వకపోతే జూన్ నెలలో ఉద్యోగులకు 50 శాతం వేతనాలు మాత్రమే ఇవ్వాలని రాష్ట్ర ఆర్థిక శాఖ పరిశీలిస్తున్నట్లు సమాచారం.