25,000 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి గ్రీన్‌సిగ్నల్

ABN , First Publish Date - 2022-03-20T00:06:49+05:30 IST

భగవంత్ సింగ్ మాన్ సారథ్యంలోని పంజాబ్ సర్కార్ తొలి క్యాబినెట్‌ సమావేశంలోనే సంచలన నిర్ణయం..

25,000 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి గ్రీన్‌సిగ్నల్

న్యూఢిల్లీ: భగవంత్ సింగ్ మాన్ సారథ్యంలోని పంజాబ్ సర్కార్ తొలి క్యాబినెట్‌ సమావేశంలోనే సంచలన నిర్ణయం తీసుకుంది. 25,000 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలనే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. మాన్ ఆధ్వర్యంలో తొలి క్యాబినెట్ సమావేశం శనివారం జరిగింది. రాష్ట్రంలోని నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తామంటూ ఇటీవల జరిగిన పంజాబ్ ఎన్నికల్లో చేసిన వాగ్దానానికి అనుగుణంగా 'ఆప్' ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. 25,000 ఉద్యోగాల్లో పంజాబ్ పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న 10,000 ఉద్యోగాలు, ఇతర ప్రభుత్వ శాఖల్లోని 15,000 ఖాళీలను భర్తీ చేయాలని పంజాబ్ సర్కార్ నిర్ణయించింది.


నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని, రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రుల్లో మెరిగైన వసతులు కల్పిస్తామని, 300 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్, 18 ఏళ్లు పైబడిన మహిళలకు ప్రతినెలా రూ.1,000 సాయం అందిస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తమ ఎన్నికల ప్రచారంలో వాగ్దానం చేశారు. అవినీతిరహిత ప్రభుత్వాన్ని అందిస్తామని, మాదకద్రవ్యాల బెడదకు కళ్లెం వేస్తామని కూడా భరోసా ఇచ్చారు. ఇందుకు అనుగుణంగా భగవంత్ మాన్ ఇటీవల ఒక ప్రకటన చేస్తూ, మార్చి 23న షదీద్ దివస్ (అమరవీరుల దినోత్సవం)ను పురస్కరించుకుని అవినీతి నిరోధక హెల్ప్‌లైన్ ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. అవినీతిపై వాట్సాప్‌ ద్వారా ప్రజలు ఫిర్యాదులు చేయవచ్చని తెలిపారు.

Updated Date - 2022-03-20T00:06:49+05:30 IST