Chief Minister: పారిశ్రామికాభివృద్ధే మా లక్ష్యం

ABN , First Publish Date - 2022-08-26T14:12:57+05:30 IST

అన్ని జిల్లాలను పారిశ్రామికంగా అభివృద్ధి చేయడమే డీఎంకే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఆ దిశగానే దక్షిణాది జిల్లాలతోపాటు, ఉత్తరాది జిల్లాల్లో కొత్త

Chief Minister: పారిశ్రామికాభివృద్ధే మా లక్ష్యం

- అన్ని జిల్లాల్లో ఎగుమతుల కేంద్రాలు 

- తిరుప్పూరు సభలో సీఎం స్టాలిన్‌


చెన్నై, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): అన్ని జిల్లాలను పారిశ్రామికంగా అభివృద్ధి చేయడమే డీఎంకే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఆ దిశగానే దక్షిణాది జిల్లాలతోపాటు, ఉత్తరాది జిల్లాల్లో కొత్త పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నామని ముఖ్యమంత్రి స్టాలిన్‌(Chief Minister Stalin) పేర్కొన్నారు. ఆ మేరకు త్వరలో ప్రతిజిల్లాలోనూ ప్రత్యేక ఎగుమతి కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో డీఎంకే ప్రభుత్వం గడిచిన పదిహేడు నెలల్లో దేశ విదేశాలకు చెందిన 221 సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుని రూ.2.20లక్షల కోట్ల మేరకు పెట్టుబడులను సమీకరించిందని చెప్పారు. తిరుప్పూరులో గురువారం చిన్న, మధ్యతరహా పరిశ్రమల సమాఖ్య ఆధ్వర్యంలో ‘పరిశ్రమలను ప్రోత్సహిద్దాం’ పేరుతో ఏర్పాటైన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఆ సందర్భంగా చిన్నతరహా మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి కోసం రూ.167.58 కోట్లతో చేపట్టనున్న కొత్త పథకాలకు ఆయన శ్రీకారం చుట్టారు. ఇదే విధంగా తిరుప్పూరు జిల్లాల్లో అమలు చేయనున్న పథకాలకు కూడా ఆయన శంకుస్థాపన చేశారు. రూ.36.60 కోట్లతో నాలుగు నార వస్తువుల తయారీ కేంద్రాల ఏర్పాటుకు సంబంధించిన ఉత్తర్వులు కూడా మంజూరు చేశారు. జనపనార వస్తువుల తయారీ పెంచేదిశగా కొత్తగా రాష్ట్ర నార వాణిజ్య అభివృద్ధి సంస్థను కూడా ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో స్టాలిన్‌ ప్రసంగిస్తూ... స్వాతంత్య్ర సంగ్రామంలో పేరుపొందిన తిరుప్పూరు నగరానికి కార్పొరేషన్‌ స్థాయి కల్పించిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధికి దక్కుతుందన్నారు. తిరుప్పూరు నగరం రాష్ట్రంలో చెన్నై, కోయంబత్తూరు(Chennai, Coimbatore) తర్వాత మూడో వాణిజ్య కేంద్రంగా పేరుగడించిందన్నారు. రాష్ట్రంలో ప్రతియేటా హోమ్‌ టెక్స్‌టైల్స్‌గా పేరుగడించిన గృహోపయోగ దుస్తులు రూ.8 వేల కోట్లకు పైగా ఉత్పత్తి అవుతున్నాయని, వీటిలో రూ.4వేల కోట్ల విలువైన దుస్తులు ఎగుమతవుతున్నాయని ఆయన చెప్పారు. డీఎంకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2092 చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు రూ.2113 కోట్లపైగా రుణాలిచ్చి ప్రోత్సహించిందన్నారు. ఈ సదస్సులో మంత్రులు దామో అన్బరసన్‌, వెల్లకోవిల్‌ సామినానాధన్‌, కయల్‌ విళి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-26T14:12:57+05:30 IST