Chief Minister: తిరుచ్చి సమీపంలో ‘పెరియార్‌ ఉలగమ్‌’

ABN , First Publish Date - 2022-09-18T13:57:47+05:30 IST

ద్రవిడ ఉద్యమనేత పెరియార్‌ జయంతి సందర్భంగా తిరుచ్చి జిల్లా సిరగనూరు ప్రాంతంలో భారీ గ్రంథాలయం, పరిశోధన కేంద్రంతో నిర్మించనున్న

Chief Minister: తిరుచ్చి సమీపంలో ‘పెరియార్‌ ఉలగమ్‌’

- సీఎం స్టాలిన్‌ శంకుస్థాపన

- 95 అడుగుల పెరియార్‌ విగ్రహం ఏర్పాటుపై ప్రకటన  


చెన్నై, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): ద్రవిడ ఉద్యమనేత పెరియార్‌ జయంతి సందర్భంగా తిరుచ్చి జిల్లా సిరగనూరు ప్రాంతంలో భారీ గ్రంథాలయం, పరిశోధన కేంద్రంతో నిర్మించనున్న ‘పెరియార్‌ ఉలగమ్‌’ (పెరియార్‌ ప్రపంచం)కు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief Minister MK Stalin) శనివారం ఉదయం శంకుస్థాపన చేశారు. స్థానిక అన్నాసాలైలోని పెరియార్‌ విగ్రహం కూడలి వద్ద ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. పెరియార్‌ విగ్రహానికి, దానికింద ఏర్పాటు చేసిన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీఎన్‌సీసీ మాజీ అధ్యక్షుడు కుమరి అనంతన్‌(Former president of TNCC Kumari Ananthan), మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఆ తర్వాత వేప్పేరిలోని పెరియార్‌ దిడల్‌కు వెళ్లిన స్టాలిన్‌ అక్కడ ఏర్పాటైన ప్రత్యేక సభలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ‘పెరియార్‌ ఉలగమ్‌’కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెరియార్‌ దిడల్‌ తమకు పుట్టిల్లు లాంటిందని, సామాజిక న్యాయం కోసం పరితపించిన ఆ దివంగత నేత ఆశయాలకనుగుణంగానే డీఎంకే ప్రభుత్వ పాలన కొనసాగుతోందని వెల్లడించారు. సచివాలయం వద్ద మంత్రులు, అధికారులు, సిబ్బంది చేత సామాజిక న్యాయం ప్రతిజ్ఞ చేయించి ఈ సభలో పాల్గొనేందుకు వచ్చానని ఆయన తెలిపారు. పెరియార్‌ దిడల్‌ రాష్ట్రానికే కాకుండా దేశానికే సామాజిక న్యాయాన్ని ఎలుగెత్తి చాటే ప్రధాన కేంద్రంగా భాసిల్లుతోందన్నారు. పెరియార్‌ రచనలను భావితరాలకు అందించాలనే ఆశయంతోనే సిరుగానూరు వద్ద భారీ గ్రంథాయలం, పరిశోధన కేంద్రంతో పెరియార్‌ ఉలగమ్‌ ఏర్పాటు చేయనున్నామని వెల్లడించారు. అంతేగాకుండా అక్కడ 95 అడుగుల పెరియార్‌ విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించనున్నట్లు ప్రకటించారు. పెరియార్‌ రచనలను ఇతర భాషల్లోకి అనువదించేందుకు కూడా తమ ప్రభుత్వం చర్యలు చేపడుతుందని తెలిపారు. ద్రవిడ కళగం నేత కె.వీరమణి అధ్యక్షత వహించిన ఈ సభలో మంత్రులు కేఎన్‌ నెహ్రూ, ఏవీ వేలు, పీకే శేఖర్‌బాబు, ఎంఆర్‌కే పన్నీర్‌సెల్వం, పెరియకరుప్పన్‌, గణేశన్‌, కయల్‌విళి, మనో తంగరాజ్‌, సెంజి మస్తాన్‌, ఎంపీలు దయానిధి మారన్‌, ఎ.రాజా, శాసనసభ్యులు తాయగమ్‌ కవి, పరంధామన్‌, జోసెఫ్‌ శామువేల్‌, మేయర్‌ ఆర్‌ ప్రియా, డిప్యూటీ మేయర్‌ మహే్‌షకుమార్‌, టీఎన్‌సీసీ మాజీ అధ్యక్షుడు ఈవీకేఎస్‌ ఇలంగోవన్‌, సీపీఎం నేత బాలకృష్ణన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-09-18T13:57:47+05:30 IST