వ్యాపారుల సంక్షేమమే లక్ష్యం

ABN , First Publish Date - 2022-05-06T14:06:32+05:30 IST

రాష్ట్రంలోని వ్యాపారుల సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఆ దిశగానే వారికి ఎన్నో రకాల పన్నుల నుంచి మినహాయింపు కల్పించామని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ పేర్కొన్నారు. తిరుచ్చిలో

వ్యాపారుల సంక్షేమమే లక్ష్యం

- ఇకపై మూడేళ్లకొకసారి లైసెన్సు

- నష్టపరిహారం రూ.3లక్షలకు పెంపు

- తిరుచ్చి మహానాడులో వ్యాపారులకు స్టాలిన్‌ వరాలు


చెన్నై: రాష్ట్రంలోని వ్యాపారుల సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఆ దిశగానే వారికి ఎన్నో రకాల పన్నుల నుంచి మినహాయింపు కల్పించామని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ పేర్కొన్నారు. తిరుచ్చిలో గురువారం జరిగిన వాణిజ్య సంఘాల సమాఖ్య మహనాడుకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ఇకపై వ్యాపారుల కోసం యేడాదికొకసారి ఇచ్చే లైసెన్సును మూడేళ్లకు ఒకమారు జారీ చేసే విధానాన్ని అమలు చేయనున్నట్లు సభికుల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. వ్యాపారులకు కొన్ని రకాల పన్నులను మినహాయించాలని జీఎస్టీ కౌన్సిల్‌కు ప్రభుత్వం విజ్ఞప్తి చేసిందని ఆయన తెలిపారు. ఇప్పటి వరకూ వ్యాపారులకు తమ ప్రభుత్వం 65 రకాల పన్నులను ఉపసంహరించుకుందని, అగ్ని ప్రమాదాల వల్ల నష్టపోయే వ్యాపారులకు ఇచ్చే నష్టపరిహారాన్ని రూ.5వేల నుండి రూ.20వేలకు పెంచుతున్నట్లు తెలిపారు. ఇదే విధంగా వ్యాపారులు మృతి చెందితే సంక్షేమ సంస్థ ద్వారా ఇచ్చే నష్టపరిహారాన్ని రూ.లక్ష నుంచి రూ.3 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. ఇదే విధంగా ఇకపై జిమ్‌ల నిర్వహణకు పోలీసుల అనుమతి అవసరం లేదని తెలిపారు. రహదారుల విస్తరణ సందర్భంగా దుకాణాలు కోల్పోయే వ్యాపారులకు స్థానిక సంస్థలకు చెందిన భవనాలను అద్దెకిచ్చే పథకాన్ని కూడా అమలు చేయనున్నామని వెల్లడించారు. ప్రభుత్వ భవనాల్లో గదులను వ్యాపారాల నిమిత్తం అద్దెకిచ్చే పద్ధతిని కూడా త్వరలో ప్రవేశపెడతామన్నారు. వ్యాపారుల సంక్షేమ బోర్డులో వాణిజ్య సమాఖ్యల ప్రతినిధులకు స్థానం కల్పించనున్నామని స్టాలిన్‌ వెల్లడించారు.కరోనా సంక్షోభసమయంలో తనఆదేశం ప్ర కారం నిబంధనలు పాటించి దుకాణాలను మూసిన వ్యాపారులందరికి ధన్యవాదాలు తెలిపేందుకే మహానాడుకు వచ్చానని చెప్పారు. డీఎంకే ప్రభుత్వం అధికారంలోకి రాగానే కరోనా నిరోధక చర్యల నిమిత్తం విరాళాలందించాలని పిలుపునివ్వగానే విక్రమరాజా వ్యాపారులందరితోనూ మాట్లాడి భారీగా విరాళాలను అందజేశారని స్టాలిన్‌ ధన్యవాదాలు తెలిపారు. వాణిజ్య సంఘాల సమాఖ్య అధ్యక్షుడు విక్రమరాజా అధ్యక్షత వహించిన ఈ మహానాడులో మంత్రులు కేఎన్‌ నెహ్రూ, అన్బిల్‌ మహేశ్‌పొయ్యామొళి, మూర్తి, సమాఖ్య ప్రధాన కార్యదర్శి గోవిందరాజులు, కోశాధికారి సదక్‌తుల్లా తదితరులు పాల్గొన్నారు.

Read more