సీఎం అధ్యక్షతన లోకాయుక్త సమావేశం
ABN , First Publish Date - 2022-03-15T13:53:34+05:30 IST
రాష్ట్ర లోకాయుక్త సమావేశం సచివాలయంలో సోమవారం ఉదయం ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ప్రధాన ప్రతిపక్షనాయకుడు ఎడప్పాడి పళనిస్వామి గైర్హాజరయ్యారు. స్పీకర్ అప్పావు,
- ఎడప్పాడి గైర్హాజరు
చెన్నై: రాష్ట్ర లోకాయుక్త సమావేశం సచివాలయంలో సోమవారం ఉదయం ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ప్రధాన ప్రతిపక్షనాయకుడు ఎడప్పాడి పళనిస్వామి గైర్హాజరయ్యారు. స్పీకర్ అప్పావు, లోకాయుక్త అధ్యక్షుడు, హైకోర్టు మాజీ న్యాయమూర్తి దేవదాస్, సభ్యులు జయబాలన్, కృష్ణమూర్తి, రాజారామ్, ఆరుముగం హాజరయ్యారు. ముఖ్యమంత్రి, మంత్రులు, శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యుల, ప్రభుత్వ ఉన్నతాధికారులు అవినీతి అక్రమాలకు పాల్పడితే లోకాయుక్త విచారణ జరుపుతుంది. నాలుగేళ్ల వ్యవధిలో జరిగిన అవినీతి అక్రమాలపై కూడా విచారణ జరిపే వీలుంది. ఈ నేపథ్యంలో గత అన్నాడీఎంకే మాజీ మంత్రులు, ఆ ప్రభుత్వ హయాంలో అధికారులు పాల్పడిన అవినీతి అక్రమాలపై లోకాయుక్త విచారణ జరిపే అవకాశాలపై ఈ సమావేశంలో చర్చలు జరిగినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
25న దుబాయ్కి స్టాలిన్
రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ ఈ నెల 25న దుబాయ్కి పయనమవుతున్నారు. అక్కడ జరిగే ‘వరల్డ్ ఎక్స్పో’లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ నెల 18న చేనేత, వ్యవసాయ, పర్యాటక, ఆరోగ్యశాఖలకు చెందిన ప్రత్యేక స్టాల్స్ను ఏర్పాటు చేయనున్నారు. ఆ స్టాల్స్ను సందర్శించి విదేశీ పెట్టుబడుల సమీకరణ దిశగా అక్కడి వాణిజ్యవేత్తలతో స్టాలిన్ చర్చలు జరుపనున్నారు. పారిశ్రామికవేత్తలతోనూ ఆయన భేటీ అవుతారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొనే నిమిత్తం ఆయన ఈ నెల 25న దుబాయ్ వెళ్లి మూడు రోజులపాటు అక్కడే బసచేసి ఈ నెల 28న చెన్నైకి తిరిగి వస్తారు. ఈ నెల 18న శాసనసభలో వార్షిక బడ్జెట్ దాఖలు కానుంది. ఆ బడ్జెట్పై ఈ నెల 21న చర్చలు ప్రారంభమవుతాయి. అయితే స్టాలిన్ ఈ నెల 25న దుబాయ్ పర్యటన ఖరారు కావడంతో బడ్జెట్పై చర్చలు నాలుగు రోజులలోపే ముగుస్తాయని తెలుస్తోంది.