నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే కుటుంబీకులకు సీఎం పరామర్శ

ABN , First Publish Date - 2020-12-02T05:30:00+05:30 IST

నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేష్‌ గుప్తా తండ్రి కృష్ణమూర్తి ద్వాదశ దినకర్మకు సీఎం కేసీఆర్‌ హాజరయ్యారు.

నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే కుటుంబీకులకు సీఎం పరామర్శ
అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేష్‌ గుప్త కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌

బిగాల గణేష్‌ గుప్తా తండ్రి కృష్ణమూర్తి చిత్రపటానికి నివాళ్లు అర్పించిన సీఎం
హాజరైన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలు


నిజామాబాద్‌, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి):  

నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేష్‌ గుప్తా తండ్రి కృష్ణమూర్తి ద్వాదశ దినకర్మకు సీఎం కేసీఆర్‌ హాజరయ్యారు. నిజామాబాద్‌ జిల్లా మాక్లూర్‌లో బుధవారం జరిగిన కార్యక్రమానికి వచ్చిన ఆయన ఎమ్మెల్యే కుటుంబసభ్యులను పరామర్శించారు. వారిని ఓదార్చారు. కొద్దిసేపు వారితో ఉన్న సీఎం ఎలా మృతి చెందాడు అని కుటుంబసభ్యులను అడిగి తెలుసుకున్నారు. అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్తతో పాటు ఆయన సోదరుడు మహేష్‌ బిగాలను దైర్యంగా ఉండాలని ఓదార్చారు. హైదరాబాద్‌ నుంచి రోడ్డు మార్గం లో ఆయన మధ్యాహ్నం 1.30 గంటలకు మాక్లూర్‌కు చేరుకున్నారు. ఎమ్మెల్యే తండ్రి చిత్రపటానికి  పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఆయన ఇంట్లో సుమారు 50 నిమిషాల పాటు ఉన్న సీఎం కేసీఆర్‌ తిరిగి 2.20 గంటలకు రోడ్డు మార్గంలోనే హైదరాబాద్‌కు వెళ్లారు. కాగా నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్తా తండ్రి కృష్ణమూర్తి 11 రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన స్వగ్రామంలోనే అంత్యక్రియలతో పాటు కర్మకాండలను నిర్వహించారు. చనిపోయిన తర్వాత పరామర్శ కోసం సీఎం కేసీఆర్‌ జిల్లాకు వచ్చారు. కాగా సీఎం పర్యటన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఎంతో పాటు మంత్రులు మహ్ముద్‌అలీ, ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, హరీష్‌రావులు హాజరయ్యారు. అలాగే ఉమ్మడి జిల్లాకు చెందిన విప్‌ గంప గోవర్ధన్‌, పోలీసు హౌజింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ కోలేటి దామోధర్‌, టూరిజం కార్పొరేషన్‌ చైర్మన్‌ శ్రీనివాస్‌ గుప్తా, రాజ్యసభ సభ్యుడు కె.ఆర్‌.సురేష్‌రెడ్డి, జడ్పీ చైర్మన్‌లు దాదన్న గారి విఠల్‌రావు, దఫేదార్‌ శోభ, ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్‌, హన్మంత్‌షిండే, నల్లమడుగు సురేందర్‌, ఎమ్మెల్సీలు ఆకుల లలిత, వి.జి.గౌడ్‌, డీసీసీబీ బ్యాంక్‌ చైర్మన్‌ పోచారం భాస్కర్‌రెడ్డి, ఐడీసీఎంఎస్‌ చైర్మన్‌ మోహ న్‌,  టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి, నుడా చైర్మన్‌ ప్రభాకర్‌రెడ్డి, రెడ్‌కో చైర్మన్‌ అలీం, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ, మానాల మోహన్‌రెడ్డి, గడుగు గంగాధర్‌, ధన్‌పాల్‌ సూర్యనారాయణగుప్తతో పాటు ఇతర నేతలు హాజరయ్యారు.

Updated Date - 2020-12-02T05:30:00+05:30 IST