CM YS Jagan పర్యటన నేపథ్యంలో వాహనాల దారి మళ్లింపు
ABN , First Publish Date - 2021-12-23T13:12:15+05:30 IST
CM YS Jagan పర్యటన నేపథ్యంలో వాహనాల దారి మళ్లింపు
కడప జిల్లా/గోపవరం : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గోపవరం మండల పర్యటన నేపథ్యంలో వాహనాలను దారి మళ్లిస్తున్నట్లు ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. గురువారం గోపవరం మండల ప్రాజెక్టు కాలనీ వద్ద సెంచురీ ఫ్లైవుడ్ పరిశ్రమకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తున్న నేపథ్యంలో కృష్ణ, గుంటూరు, నెల్లూరు వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులు మినహా ఇతర వాహనాలను దారి మళ్లిస్తున్నట్లు తెలిపారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా గమ్యస్థానాలు చేరుకోవాలని సూచించారు.
నెల్లూరుకు వెళ్లేవారు కార్లు, ద్విచక్ర వాహనదారులు శ్రీనివాసపురం, గోపవరం, సంగసముద్రం, బేతాయిపల్లి, బెడుసుపల్లి, పీపీకుంట మీదుగా నెల్లూరు వెళ్లవచ్చన్నారు. ఈ ఆంక్షలు గురువారం మధ్యాహ్నం 12 గంటల నుంచి 3.30 గంటల వరకు అమలులో ఉంటాయన్నారు. అనుమతి ఉన్న వ్యక్తులకు మాత్రమే ప్రవేశముంటుందని మిగిలిన వారు ఎవరూ అనవసరంగా ఆ ప్రాంతాల్లో సంచరించవద్దని సూచించారు.